హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ)/నాంపల్లి: గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్, ఒక జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ను గురువారం అరెస్టు చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ కుంభకోణంలో ఇటీవల పశుసంవర్థశాఖ అధికారులపై క్రిమినల్ కేసు నమోదవగా.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ అధికారులు లోతుగా విచారణ జరిపారు.
పశుసంవర్ధక శాఖకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్, కామారెడ్డి ఏరియా వెటర్నరీ హాస్పిటల్ డాక్టర్ డీ రవి (ఏ 3) మేడ్చల్ డీవీ అండ్ ఏహెచ్వో డాక్టర్ ఎం ఆదిత్య కేశవసాయి (ఏ 4) రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి పసుల రఘుపతిరెడ్డి (ఏ 5), వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేశ్ (ఏ 6) కొందరు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మకయ్యి, నకిలీ ఖాతాలు సృష్టించి దాదాపు రూ.2.10 కోట్ల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఏసీబీ అధికారులు తేల్చారు.
ఈ నలుగురు అధికారులు ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం తీసుకురావడంతో అరెస్టు చేసినట్టు తెలిపారు. అరెస్టు అనంతరం నలుగురిని ఏసీబీ కోర్టు హాజరుపర్చారు. కోర్టు వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. గొర్రెల పంపణీ పథకం కోసం ప్రకాశం జిల్లాకు చెందిన 18 మంది నుంచి గొర్రెలను కొనుగోలు చేయడంలో పశు సంవర్ధకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు కేశవసాయి, రవి..
రంగారెడ్డి జిల్లాకు చెందిన గొర్రెల పంపిణీ కాంట్రాక్టర్లు మోయినుద్దీన్, ఆయన కుమారుడు ఇక్రమ్తో కలిసి మొత్తం 133 యూనిట్ల (ఒకోయూనిట్కు 21 చొప్పున)ను కొని, ఆ డబ్బును తమకు చెల్లించలేదని ప్రకాశం జిల్లాకు చెందిన ఏడుకొండలు అనే వ్యక్తి గచ్చిబౌలి స్టేషన్లో గతంలో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పరిశీలించిన పోలీసులు ఎస్ఐఆర్లో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లతో పాటు కాంట్రాక్టర్లుగా ఉన్న తండ్రీ కొడుకులను నిందితులుగా పేరొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కేసును ఏసీబీ విచారణ చేపట్టి.. నలుగురిని అరెస్టు చేసింది.