యాదాద్రి భువనగిరి : రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న భువనగిరి పట్టణానికి చెందిన నలుగురిని పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్ కు తరలించారు. డీసీపీ నారాయణ రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. భువనగిరి పట్టణానికి చెందిన నలుగురు వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో గత కొంత కాలంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.
అమాయక ప్రజలకు అధిక వడ్డీ ఆశ చూపి పెట్టుబడులు పెట్టించడం.. తీరా భూములను రిజిస్ట్రేషన్ చేయక పోవడంతో కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారించిన పోలీసులు మోసాలకు పాల్పడుతున్న ఎస్ కె షాకీర్, ఎండీ అబ్దుల్ రెహమాన్, ఎండీ అబ్దుల్ రాఖీబ్, షేక్ మహ్మద్ ఉస్మాన్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించి వారి వద్ద నుంచి ఐదు కోట్ల విలువ గల నగలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వివరించారు. అధిక లాభాలు కల్పిస్తామని చెప్పే మాటలను నమ్మి పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సూచించారు.