హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): నిమ్స్ దవాఖానలో నూతన బ్లాక్ నిర్మాణానికి నాలుగు ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేశాయి. ఎల్అండ్టీ, మేఘా ఇంజినీరింగ్, ఎన్సీసీ, డీఎస్ఆర్ సంస్థలు వీటిని దాఖలు చేశాయి. ప్రస్తుతం ఈ టెండర్ల పరిశీలన జరుగుతున్నదని, ఇందులో ఎంపికైన ఏజెన్సీల ఫైనాన్స్ బిడ్లను తెరిచి తక్కువ ధర కోట్ చేసిన ఏజెన్సీని ఎంపికచేస్తామని అధికారులు వెల్లడించారు.
ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవల కోసం నిమ్స్లో 32 ఎకరాల్లో రూ.1,571 కోట్ల వ్యయంతో నూతన బ్లాక్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఇటీవల శంకుస్థాపన చేసిన విషయం విదితమే. ఈ నిర్మాణ బాధ్యతలను రోడ్లు, భవనాల శాఖ చేపట్టింది. ఎనిమిది నుంచి 15 అంతస్తులుగా నిర్మించనున్న ఈ బ్లాక్లో 1,200 ఆక్సిజన్, 500 ఐసీయూ బెడ్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో నిమ్స్లో మొత్తం బెడ్ల సంఖ్య 4 వేలకు చేరుకుంటుంది.