రంగారెడ్డి, జూన్ 6 (నమస్తే తెలంగాణ)/తుర్కయాంజాల్ : రంగారెడ్డి జిల్లా, తొర్రూర్ డివిజన్ పరిధి కోహెడలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ శంకుస్థాపన తీవ్ర నిరసనల నడుమ జరిగింది. శంకుస్థాపన సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ర్టానికి వచ్చే ఆదాయంలో రంగారెడ్డి జిల్లా నుంచే సుమారు 60 శాతం వస్తుందని, అందుకే రంగారెడ్డి జిల్లాలో అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చే కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చే భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని, ఇక్కడ ఐదు వందల అంతర్జాతీయ స్థాయి కంపెనీలు ఏర్పాటుచేసేందుకు ముందుకొస్తున్నట్టు తెలిపారు. రూ.2,300 కోట్లతో అత్యంత ఆధునీకరణ రీతిలో కోహెడలోనూ అంతర్జాతీయ స్థాయి సమీకృత పండ్ల మార్కెట్ను నిర్మిస్తున్నామని తెలిపారు. శంకుస్థాపన నేపథ్యంలో.. సర్వే నంబర్ 167/1లో ఎన్నో ఏండ్లుగా భూమి సాగుచేసుకుంటున్నామని, తమకు పరిహారం ఇచ్చిన తర్వాతే పండ్ల మార్కెట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులను శనివారం ఉదయమే అరెస్టుచేసి నాగోల్ పోలీసుస్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రైతులతోపాటు వారికి మద్దతు పలికిన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి నాగోల్ పోలీస్స్టేషన్కు తరలించారు. రైతుల పక్షాన నిలిచిన అధికార పార్టీ మాజీ కౌన్సిలర్లు, నాయకులను సైతం స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అరెస్ట్ చేయించినట్టు మాజీ కౌన్సిలర్లు సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడంతో అది వైరల్గా మారింది. రైతులకు పరిహారం ఇవ్వకుండా పండ్ల మార్కెట్కు శంకుస్థాపన చేయటాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రైతులకు తగిన పరిహారం ఇవ్వాలని, లేనిపక్షంలో మార్కెట్ పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. కోహెడ మార్కెట్కు కేటాయించిన భూమిపై సీఎం రేవంత్రెడ్డికి పూర్తిస్థాయి అవగాహన లేకుండానే భూమిపూజ చేయడం సరికాదని పేర్కొన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం నాగోల్ పోలీస్స్టేషన్కు వెళ్లి అరెస్టయిన రైతులను కిషన్రెడ్డి పరామర్శించారు.