మహబూబ్నగర్, మే 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్వరాష్ర్టాన్ని సాధించడంతో టీజీవో లక్ష్యం నెరవేరిందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గెజిటెట్ ఉద్యోగులంతా పోరాడాలనే నేపథ్యంలో పుట్టిన సంఘమే టీజీవో అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగ సంఘం భవన నిర్మాణానికి కలెక్టర్ రవినాయక్, టీజీవో స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ సహదేవ్తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ చిన్న రాష్ర్టాలు ఏర్పడితేనే పరిపాలన సులభంగా ఉంటుందనే ఆలోచనతో తెలంగాణ కోసం అన్ని సంఘాలు ఏకమై పోరాటం చేశాయని తెలిపారు. తమ ఐక్యతను చూసిన నాటి ముఖ్యమంత్రి తమను పిలిచి ‘ మీ హౌసింగ్ సొసైటీకి 250 ఎకరాలు ఇస్తా.. జూబ్లీహిల్స్లో ఎకరం స్థలం భవనం కోసం కేటాయిస్తా’మని ఆశ చూపినట్టు చెప్పారు. ఇక కిరణ్కుమార్రెడ్డి తమకు ఎన్నో ఆఫర్లు ఇచ్చినా తిరస్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. తమకు తెలంగాణ రాష్ట్రమే కావాలని ఖరాఖండిగా చెప్పామని అన్నారు. రాష్ట్ర సాధన తర్వాత ప్రభుత్వంతో కలిసి ఉంటూనే పీఆర్సీ తెచ్చుకోవడంలో, 40 వేల మందికి ప్రమోషన్లు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించినట్టు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర కమిటీ కార్యదర్శి సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, టీజీవో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.