హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారతదేశ చరిత్రలో బీసీల సంక్షేమాన్ని పట్టించుకున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్లో సహచర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వీ శ్రీనివాస్గౌడ్తో కలిసి వంజరి సంఘం భవనానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి గంగుల మాట్లాడుతూ, గత ప్రభుత్వాల హయాంలో బీసీలు వెనుకకు నెట్టివేయబడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. కులసంఘ భవనాల నిర్మాణాల కోసం గత ప్రభుత్వాలకు ఎమ్మెల్యేగా ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ గుంట జాగా కూడా కేటాయించలేదని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 41 కుల సంఘాలకు వేల కోట్ల విలువైన 87.3 ఎకరాలను కేటాయించి, ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నదని చెప్పారు. బీసీ పక్షపాతిగా సీఎం కేసీఆర్ రాజధాని నడిబొడ్డున బీసీ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేస్తున్నారని కొనియాడారు. ఉప్పల్ భగాయత్, కోకాపేటల్లో బీసీ ఆత్మగౌరవ భవనాలకు కేటాయించిన ప్రాంతాల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనే జీ, విద్యుత్లాంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తున్నదని వివరించారు. ఆదివారం మరో 13 బీసీ కుల సంఘాల భవనాలకు శంకుస్థాపనలు చేయనున్నామని, దసరా నాటికి సకల సదుపాయాలతో భవనాలను ప్రారంభిస్తామని చెప్పారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వీ శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాలకు సమ ప్రాధాన్యతనిచ్చి ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నదని తెలిపారు. వంజరి సంఘం ఆత్మగౌరవ భవనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎకరం స్థలం కేటాయించడం హర్షణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు భేతి సుభాశ్రెడ్డి, కాలేరు వెంకటేశ్, బీఆర్ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ డిఫ్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి, వంజరి సంఘం అధ్యక్షుడు కాలేరు నరేందర్, ప్రధాన కార్యదర్శి కందారి వెంకటేశం, కోశాధికారి కాలేరు అమరేందర్, సంఘం సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.