హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ప్రజలకు పోషక విలువలతో కూడిన బియ్యం అందించాలనే ఉద్దేశంతో ప్రజాపంపిణీలో సాధారణ బియ్యానికి బదులుగా బలవర్ధక బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్) పంపిణీచేయాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్లో ఫోర్టిఫైడ్ రైస్ ఇచ్చేందుకు పౌరసరఫరాలశాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రేషన్లో సాధారణ బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. తాజా నిర్ణయం ప్రకారం ఇందులో ఫోర్టిఫైడ్ కెర్నల్ కలిపిన బియ్యం సరఫరా చేయనున్నారు. ఫోర్టిఫైడ్ రైస్లో విటమిన్లు, ఖనిజాలు, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ-12 ఉంటాయి. ఈ అన్నం తినడం ద్వారా మనిషికి కావాల్సిన పోషక విలువలు అందుతాయి. వీటిని తిన్నవారిలో రోగనిరోధక శక్తి పెరగడంతోపాటు రక్తహీనత తగ్గుతుంది. రాష్ట్రంలో చిన్న పిల్లలు, బాలికల్లో విటమిన్ల లోపం, రక్తహీనత తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథకంలో ఫోర్టిఫైడ్ రైస్ను అందిస్తున్నది. దీన్ని క్రమంగా విస్తరించి ఆసిఫాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో ప్రజా పంపిణీలో రేషన్కార్డుదారులకు అందజేస్తున్నది.
ఫోర్టిఫైడ్ రైస్ అంటే..
సాధారణ బియ్యాన్ని పిండిలా మార్చి ఈ మిశ్రమానికి అవసరమైన మోతాదులో విటమిన్లను, ఖనిజాలను కలుపుతారు. ఈ మిశ్రమాన్ని తిరిగి ప్రత్యేక యంత్రాల ద్వారా బి య్యం గింజలుగా మార్చుతారు. ఈ గింజలనే ఫోర్టిఫైడ్ కెర్నల్స్ అంటారు. క్వింటా బియ్యంలో 99 కిలోల సాధారణ బియ్యం ఉంటే ఒక కిలో పొర్టిఫైడ్ కెర్నల్స్ను కలుపుతారు. ఈ మొత్తాన్ని ఫోర్టిఫైడ్ రైస్గా పరిగణిస్తారు.