Former’s Protest | రైతుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. గతంలో మాదిరిగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఢిల్లీ సరిహద్దుల్లోకి ప్రవేశించకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ సరిహద్దుల్లోకి రైతులు రాకుండా అడ్డుకోవాలని కేంద్ర హోంశాఖ పోలీస్ కమిషనర్ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాజధాని సరిహద్దుల్లో అభేద్యమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఘాజీపూర్, సింఘు, తిక్రీ సరిహద్దులతో పాటు న్యూఢిల్లీ జిల్లాలోనే 30వేల మందికిపైగా పోలీసులను మోహరించారు. పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా స్వయంగా భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
స్వయంగా సరిహద్దులకు వెళ్లి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. దేశ రాజధాని సరిహద్దుల్లో 200 కంపెనీల ఢిల్లీ పోలీసులను మోహరించారు. ఒక్కో కంపెనీలో 70 మంది వరకు సిబ్బంది ఉంటారు. వారిని సింఘు, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో నియమించారు. హోం మంత్రిత్వశాఖ మరో 82 కంపెనీలను పోలీస్శాఖకు అప్పగించింది. మొత్తం 150 కంపెనీల సిబ్బందిని బందోబస్తు కోసం మోహరించారు. న్యూఢిల్లీలోనే 1,260 మంది ఔటర్ ఫోర్స్ పోలీసులను మోహరించారు. జిల్లాలోనే 1000 మందికిపైగా పోలీసులు నిఘా ఉంచారని న్యూ ఢిల్లీ జిల్లా పోలీస్ కమిషనర్ దేవేశ్ కుమార్ మహాలా తెలిపారు. హోంమంత్రి, ప్రధాని నివాసం, ఇతర వీవీఐపీ స్థలాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
అలాగే, ముఖ్యమైన ప్రదేశాల్లో పికెట్లు, ప్రత్యేక పెట్రోలింగ్ చేపడుతున్నారు. అయితే, రైతులు చొచ్కుకొని ఢిల్లీలోకి వస్తే ఛత్రసాల్ స్టేడియంలో నిరసన తెలిపేందుకు అనుమతించనున్నట్లు తెలిసింది. అయితే, ప్రస్తుతానికి స్టేడియాన్ని డిటెన్షన్ సెంటర్గా మార్చేందుకు ఢిల్లీ సర్కారు నిరాకరించింది. స్టేడియంలో ప్రదర్శన కోసం లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. మరో వైపు రైతుల ఆందోళన, పోలీసుల మోహరింపు నేపథ్యంలో భారీగా ట్రాపిక్ నిలిచిపోతున్నది. 44వ నెంబర్ జాతీయ రహదారిని సింఘు సరిహద్దుల్లో మూసివేశారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని రైతులకు పోలీసులు అడ్వైజరీని జారీ చేశారు.