తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): 1986లో వచ్చిన వరద కంటే ఎక్కువస్థాయిలో, గోదావరి, ప్రాణహిత నదులు ఒకేసారి పొంగడంతో వచ్చిన బ్యాక్వాటర్ కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి, అన్నారం పంప్హౌస్లు మునిగిపోయాయని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం తేల్చిచెప్పింది. గోదావరి వరద తదితర అంశాలపై ఖైరతాబాద్లోని విద్యాసాగర్ భవన్లో శుక్రవారం విశ్రాంత ఇంజినీర్లు సమీక్ష జరిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఊహించని వరద కారణంగానే పంప్హౌస్లు మునిగిపోయాయని తేల్చిచెప్పారు. ఇకపై అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా పంపింగ్ స్టేషన్ల చుట్టూ గోడ, లేక మట్టికట్టను నిర్మించాలని సూచించారు.
అన్నారం బరాజ్ దగ్గర వరద కట్టల ఎత్తును పెంచాలని, వరదలో మునిగే భూములను ప్రభుత్వమే సేకరించాలని సూచించారు. గోదావరి, ప్రాణహిత సంగమం తరువాత బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ అనాలిసిస్ మాడల్పై అధ్యయనం చేయించాలని కోరారు. అదేవిధంగా కడెం జలాశయానికి 3 లక్షల క్యూసెక్కులకు మించిన వరదకు సరిపోయేలా డ్యామ్కు ఎడమవైపు అదనంగా డిశ్చార్జి ఏర్పాట్లు చేయాలని అభిప్రాయపడ్డారు. కడెం జలాశయానికి పైన ప్రతిపాదించిన కుప్టి జలాశయాన్ని వెంటనే చేపట్టాలని, తద్వారా కొంతమేరకు వరదను అరికట్టవచ్చని, కడెం ఆయకట్టుకు సైతం బ్యాలెన్సింగ్ జలాశయంగా అది పనిచేస్తుందని తెలిపారు. భద్రాచలం వద్ద వరదకట్టల సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వానికి సూచించారు. సమావేశంలో తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు దామోదర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్రెడ్డి, విశ్రాంత సీఈ అనంతరాములు, చంద్రమౌళి, విశ్రాంత ఈఎన్సీ రంగారెడ్డి, తన్నీరు వెంకటేశం, జియావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.