హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను రాజీలేని పోరాటాలతో కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, స్వరాష్ర్టాన్ని పదేండ్ల అనతికాలంలోనే ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతిపథంలో నడిపించి, దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత బీఆర్స్కే దక్కుతుందని చెప్పారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీ తెగించి కొట్లాడుతుందని తెలిపారు. గురువారం ఆయన శాసనసభ స్పీకర్ కార్యాలయంలో గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. కేసీఆర్తో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ప్రమాణం చేయించారు. అనంతరం అసెంబ్లీ లాబీల్లో పార్టీ నేతలందరినీ కేసీఆర్ కలిశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు కేసీఆర్కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం కేసీఆర్ బంజారాహిల్స్ నందినగర్ నివాసానికి వెళ్లారు. అక్కడ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో కలిసి భోజనం చేశారు. అనంతరం అందరితో సమావేశమయ్యారు. దేశ రాజకీయాలు, రాబోయే పార్లమెంట్ ఎన్నికలు, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తదితర అంశాలపై చర్చించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
బడ్జెట్ సమావేశాలపై దృష్టిపెట్టండి
త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై దృష్టిపెట్టాలని కేసీఆర్ సూచించినట్టు సమాచారం. ఇచ్చిన హామీలను అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత ఈజీ కాదని వ్యాఖ్యానించారు. ఆరు గ్యారెంటీల అమలుకు అవసరమయ్యే నిధులు సమకూర్చుకోవడం పెద్ద టాస్క్ అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు రూపాయి రూపాయి లెక్క చూసుకొని ఖర్చుచేశామని, ఆదాయం పెంచడంపై సమగ్రంగా కార్యాచరణ రూపొందించి అమలుచేశామని గుర్తుచేసుకున్నారు.
రాబోయే 4-5 నెలలు వేచి చూడాలని, కాంగ్రెస్ తన కార్యాచరణను ఎలా అమలు చేస్తుందో చూసి ప్రజాక్షేత్రంలో వారి డొల్లతనాన్ని బయటపెట్టాలని సూచించారు. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ కీలకమైన పాత్ర పోషించబోతున్నదని, ప్రజాసమస్యలపై పోరాటం చేద్దామని దిశానిర్దేశం చేశారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో ఉండటమే పార్టీ లక్ష్యమని స్పష్టంచేశారు. త్వరలోనే పార్టీ కార్యాలయానికి వస్తానని, అందరితో సమావేశాలు పెట్టుకుందామని చెప్పారు.
రాజకీయాల్లో ఆశావాహ దృక్పథంతో ఉండాలని, మంచిరోజులు వస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏమైనా పనులుంటే బాజాప్తా వెళ్లి కలవాలని, అపోహలకు తావివ్వకుండా చూసుకోవాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా? ఎలాంటి వైఖరి అవలంబించాలి? అనే అంశాలపై చర్చిద్దామని, మంచి స్థానాలు సంపాదించుకునే దిశగా పనిచేద్దామని చెప్పారు.
జనంతో నిండిపోయిన అసెంబ్లీ పరిసరాలు
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు కేసీఆర్ వస్తుండటంతో అసెంబ్లీ వద్దకు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అసెంబ్లీకి వెళ్లే దారిలో నాయకులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం 12.15 గంటలకు కేసీఆర్ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, మాజీమంత్రులు కేసీఆర్కు సాదరస్వాగతం పలికారు. తుంటి ఎముకకు శస్త్ర చికిత్స అయిన తర్వాత తొలిసారి బయటకు వచ్చిన కేసీఆర్కు.. పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికాయి. చేతికర్ర సహాయంతో కేసీఆర్ నడుచుకుంటూ స్పీకర్ కార్యాలయానికి చేరుకొని అక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తిచేసుకున్నారు.
ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, మాజీ స్పీకర్లు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, శ్రీనివాస్గౌడ్, గంగుల కమలాకర్, నిరంజన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్రెడ్డి, జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, మహమూద్ అలీ, కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రశాంత్రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, సంతోష్కుమార్తోపాటు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు హాజరయ్యారు.
కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీలో చేర్చడం తెలంగాణకు నష్టం
రాష్ట్రంలోని కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి చేర్చిన అంశంపై పార్టీ ఎంపీలతో కేసీఆర్ మాట్లాడారు. ఢిల్లీలో ఉన్న పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్సభలో బీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావుతో ఫోన్లో మాట్లాడారు.
కేంద్రం ప్రతిపాదనలకు రాష్ట్రం తలొగ్గడం దారుణమని, ఇది తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రైతుల ప్రయోజనాలకు భంగం కలిగే ప్రమాదం ఉన్నందున, దీనిని నిలువరించేందుకు పోరాడాలని ఎంపీలను ఆదేశించారు. దీనిపై పార్లమెంట్లో చర్చకు పట్టుబట్టాలని, సభల్లో నిరసన తెలపాలని ఎంపీలకు సూచించారు. జల్శక్తి మంత్రిని కలిసి బీఆర్ఎస్ పక్షాన నిరసన వ్యక్తం చేయాలని చెప్పారు.