హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. కాంగ్రెస్ చెప్పిన విధంగా 50 రోజుల సమయం పూర్తయ్యిందని, వారు ఇచ్చిన ఆరు గ్యారంటిల్లోని 13 హామీల్లో కేవలం రెండింటిని మాత్రమే అమలు చేశారని శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అధికారమే లక్ష్యంగా ఇబ్బంది ముబ్బడిగా హామీలను ఇచ్చారని, వాటికి కావాల్సిన నిధులు, వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారని విరుచుకుపడ్డారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కదోవ పట్టించే విధంగా కాంగ్రెస్ నేతలు ఇష్టారీతిన మాట్లడుతున్నారని, తెలంగాణ సాధించిన కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలోనూ కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవెర్చడంలో విఫలమై అధికారానికి అనేక సంవత్సరాలు దూరమైందని.. అనేక రాష్ట్రాల్లో, కేంద్రంలో అదే పరిస్థితి ఉన్నదని చెప్పారు. హామీల అమలు విషయంలో తెలంగాణలోనూ అదే పరిస్థితి పునరావృతం అవుతుందన్నారు. కర్ణాటకలో హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేసారని గుర్తుచేశారు. తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది, సంక్షేమ పథకాలు అమలు చేసింది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేశారు.