నిజామాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో ప్రజాపాలన నడువడం లేదని, కాంగ్రెస్, బీజేపీ కలయికతో కూడిన కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తున్నదని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశంలో బాజిరెడ్డి మాట్లాడారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడంపై అడుగడుగునా నిలదీస్తున్నారని తెలిపారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు.
రాష్ట్రంలో మంత్రులు విచ్చలవిడిగా దోచుకు తింటున్నారని, రేవంత్రెడ్డి, భట్టివిక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి కలిసి ఇష్టానుసారంగా లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం అమ్ముకునేందుకు నెల రోజుల పాటు నిరీక్షించడం అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా? లేనట్లా? అని ప్రశ్నించారు.
పసుపుబోర్డు బోర్డుకే పరిమితమైందని, దాని వల్ల రైతులకు ఏం ఒనగూరిందో ఎంపీ అర్వింద్ చెప్పాలని నిలదీశారు. తెలంగాణ అంతటా రేవంత్ పోవాలి… కేసీఆర్ రావాలి అనే నినాదం విస్తృతంగా వినిపిస్తున్నదని మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి వీజీ గౌడ్ అన్నారు. కార్యకర్తలంతా గులాబీ బాస్ కేసీఆర్ ఆదేశానుసారం కష్టపడి పని చేయాలని సూచించారు.