హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులంతా ప్రభుత్వ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పేర్కొన్నారు. ఉద్యోగులపై కక్ష సాధింపులు, బెదిరింపులు తగ్గాలంటే మళ్లీ ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వమే కొలువుదీరాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో వేతనాలు పెంచమని కోరిన అంగన్వాడీలను మహిళలని కూడా చూడకుండా గుర్రాలతో తొక్కించారని, అలాంటి ప్రభుత్వాలు మనకు మళ్లీ వద్దని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) పొందిన రాజేందర్ ఇటీవల బీఆర్ఎస్లో చేరారు. టీఎన్జీవోలో వివిధ హోదాల్లో 23 ఏండ్లపాటు సేవలు అందించిన ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న ఎంప్లాయీ ఫ్రెండ్లీ విధానాలకు ఆకర్షితులై కారెక్కారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’తో ఆయన మాట్లాడారు. ఆ వివరాలు మీ కోసం.. ఒక్క రోజు కూడా నల్లబ్యాడ్జీలు పెట్టుకోలే గతంలో హక్కుల సాధనకు, సమస్యల పరిష్కారానికి నోటీసులిచ్చి, ఆందోళనలకు దిగిన సందర్భాలెన్నో. ఈ పదేండ్లలో ఒక్క రోజు కూడా నల్లబ్యాడ్జీ పెట్టకుండా ఎన్నో సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోగలిగాం. మెరుగైన వేతనాలు, సౌకర్యాలు పొందగలిగాం.
ఉమ్మడి రాష్ట్రంలో వేతనాల పెంపు కోసం కండ్లలో వత్తులు వేసుకుని వేచి చూసేవాళ్లం. ఈ పదేండ్ల కాలంలో పీఆర్సీ, డీఏలు కలుపుకొంటే మొత్తంగా 132% వేతనాలు పెరిగాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పదవీ విరమణ గ్రాట్యుటీ రూ.12లక్షల నుంచి రూ. 16 లక్షలకు పెరిగింది.
ఎంప్లాయీస్ హెల్త్ స్కీం డిమాండ్ 20 ఏండ్లుగా ఉంది. వైఎస్ హయాంలోనే అమలు చేస్తామన్నారు. కానీ ఫలితం లేకుండా పోయింది. సీఎం కేసీఆర్ ఒక్కరే ఉద్యోగుల కోరికను నెరవేర్చారు. హామీ ఇచ్చినట్టుగానే ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)ను అమలు చేస్తూ జీవో విడుదల చేశారు.
ఒకప్పుడు తెలంగాణ ఉ ద్యోగులను అసమర్థులుగా ముద్రవేశారు. వారిని కీలక పోస్టులకు దూరంగా ఉంచారు. ఇప్పుడదే ఉద్యోగులు స్వరాష్ట్రంలో అవార్డులు సాధిస్తున్నారు. ఏ రాష్ర్టానికీ రాన న్ని అవార్డులు మన రాష్ర్టానికే వస్తున్నాయి.
ఒకప్పుడు కేరళ, తమిళనాడులో ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఉండేవి. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగులకే అత్యధిక వేతనాలు లభిస్తున్నాయి. ఉద్యోగులకు పీఆర్సీతోపాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచడం చరిత్రాత్మకం.
గతంలో పదోన్నతులు లేక ఎన్నో అవస్థలు పడ్డాం. ఉద్యోగముంటే చాలు అదే గొప్ప అన్న భావనలో ఉండేవారు. ప్రభుత్వం ప్రమోషన్ విధానాన్ని సరళీకృతం చేయడం.. పదోన్నతి పొందేందుకు ఉండాల్సిన గరిష్ఠ సర్వీసును మూడేండ్ల నుంచి రెండేండ్లకు కుదించడంతో 80% ఉద్యోగులకు పదోన్నతులు లభించాయి.
పెన్షనర్లకు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వయో పరిమితిని 75 ఏండ్ల నుంచి 70 ఏండ్లకు ప్రభుత్వం కుదించింది. ఇది 15 ఏండ్ల నుంచి వినిపిస్తున్న డిమాండ్. ఈ డిమాండ్ నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ సర్కారే. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 15% అదనపు పింఛన్ పొందే అవకాశం లభించింది. ఇటీవలే సీపీఎస్పై అధ్యయనానికి అధికారులతో కూడిన కమిటీని నియమిస్తామని ప్రకటించింది.
స్వరాష్ట్ర సాధనలో ఉద్యోగులది స్ఫూర్తిమంతమైన పాత్ర. రాష్ర్టాభివృద్ధిలోనూ ఉద్యోగులు, టీచర్లు అంతే నిబద్ధతతో భాగస్వాములవుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్యోగులతో ప్రభుత్వానిది పేగుబంధం. ‘కడుపునిండా అన్నం పెడతా.. చేతినిండా పనిచేయండి’ అన్న ఏకైక సీఎం కేసీఆరే. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగులతో సమాన హోదా.. కాంట్రాక్ట్ లెక్చరర్లు, ఉద్యోగుల క్రమబద్ధీకరణ సహా అనేక సంస్కరణలు చేపట్టి తమది ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వమని చాటుకున్నారు. పీఆర్సీ కమిటీతో పాటే ఐఆర్ ప్రకటించారు.