హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం ప్రగతిభవన్లో సీఎంతో కాసేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జాతీయ రాజకీయాల గురించి ఇరువురూ చర్చించుకున్నారు. ఈ భేటీలో గిరిధర్ కుమారుడు శిశిర్ గమాంగ్, ఇతర నేతలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన తర్వాత దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు సీఎం కేసీఆర్ను కలుస్తున్నారు. దేశంలో నెలకొన్న సమస్యలు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడిని ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈనెల 18వ తేదీన ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు దేశ నలమూలల నుంచి పలువురు రాజకీయ నేతలు, రైతు సంఘం నాయకులు హాజరుకాబోతున్నారు.