2016లో నేను కొనుగోలు చేసిన 904 గజాల స్థలం గురించి నామినేషన్ పత్రాల్లోనూ వెల్లడించాను. ఆ స్థలంపై జీహెచ్ఎంసీకి ఆస్తిపన్ను కడుతున్నాను. ఇందులో గోప్యతేం లేదు. ఎవరైనా చెక్ చేసుకోవచ్చు.
– సంతోష్కుమార్
Santhosh Kumar | హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): తనపై రాజకీయ కక్షతోనే అక్రమంగా కేసులు నమోదు చేశారని బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్కుమార్ స్పష్టం చేశారు. 32 ఏండ్లుగా న్యాయ వివాదం లేని స్థలంపై ఇప్పుడు ఆరోపణలు రావడం వెనుక ఎవరు ఉన్నారో సులభంగా గుర్తించవచ్చని చెప్పారు. నకిలీ పత్రాలతో తమ భూమిని ఎంపీ సంతోష్కుమార్ కబ్జా చేశారంటూ నవయుగ కంపెనీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సంతోష్ స్పందిస్తూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. షేక్పేటలోని సర్వే నంబర్ 129/54లో డోర్ నంబర్ 8-2-316/1/A/1 తో (బంజారాహిల్స్, రోడ్ నంబర్ 14) ఉన్న 904 చదరపు గజాల ఇంటి స్థలాన్ని తాను శ్యాంసుందర్ ఫుల్జాల్ (తండ్రి పీవీ హన్మంతరావు) అనే వ్యక్తి నుంచి 2016 నవంబర్ 11న సేల్ డీడ్ నంబర్ 5917/2016 ద్వారా చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. ఇందుకోసం రూ.3,81,50,000 చెల్లించానని తెలిపారు. ‘బాజాప్తా సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేశాను. కాబట్టి ఫోర్జరీ అనే మాటకు తావులేదు. ఈ స్థలంపై ఎనిమిదేండ్లుగా ఎలాంటి న్యాయవివాదం తలెత్తలేదు. నన్ను ఎవరూ సంప్రదించలేదు’ అని స్పష్టం చేశారు. తనకు ఇంటి స్థలాన్ని అమ్మిన శ్యాంసుందర్ ఆ భూమిని 1992లో సేల్ డీడ్ నంబర్ 1888/1992 ద్వారా కొనుగోలు చేసినట్టు వివరించారు. అప్పటి నుంచి న్యాయవివాదాలు లేవని శ్యాంసుందర్ తనకు స్పష్టంగా చెప్పారని తెలిపారు. ‘ఆ స్థలం 32 ఏండ్లుగా నాకు అమ్మిన వ్యక్తి, నా ఆధీనంలోనే ఉన్నది. ఆ భూమిపై ఎలాంటి న్యాయవివాదాలు లేవు’ అని పేర్కొన్నారు. తాను కొనుగోలు చేసిన తర్వాత ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని.. శ్యాంసుందర్, అంతకన్నా ముందు వాళ్లు చేపట్టిన నిర్మాణాలే ఇప్పటికీ ఉన్నాయని స్పష్టం చేశారు.
బహిరంగంగానే వివరాలు
షేక్పేటలోని తన ఆస్తి వివరాలను గోప్యంగా ఉంచలేదని సంతోష్కుమార్ పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ సమయంలో ఆస్తుల వివరాలు వెల్లడించినట్టు గుర్తుచేశారు. స్థిరాస్తుల వివరాల్లో ఈ 904 గజాల స్థలం గురించి కూడా స్పష్టంగా తెలియజేసినట్టు చెప్పారు. 2016లో కొనుగోలు చేసినప్పటి నుంచి ఆస్తిపన్ను కడుతున్నానని, 2023-24కు సంబంధించి జీహెచ్ఎంసీకి ఆస్తిపన్ను కింద రూ.1,30,240 చెల్లించినట్టు పేర్కొన్నారు. నిరుడు ఏప్రిల్ 30న ఈ మొత్తాన్ని చెల్లించానని వెల్లడించారు. కావాలంటే ఈ వివరాలను ఎవరైనా చెక్ చేసుకోవచ్చని తెలిపారు.
నిందలు వేస్తే సహించేది లేదు
ఆ స్థలంపై ఏమైనా న్యాయపరమైన అంశాలు ఉంటే ముందుగా తనకు లీగల్ నోటీసు ఇవ్వాలని, వివరణ అడగాలని సంతోష్కుమార్ అభిప్రాయపడ్డారు. అలాంటివేమీ లేకుండా నేరుగా పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ చేశామంటూ ఫిర్యాదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. వివాదాస్పద స్థలం 1350 గజాలు అని పోలీసులు పేర్కొన్నారని, మీడియా లోనూ అలానే వస్తున్నదని, కానీ తాను కొన్నది 904 గజాల ఇంటి స్థలం మాత్రమేనని స్పష్టం చేశారు. దీనిని బట్టి కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు నమోదు చేశారని స్పష్టంగా అర్థమవుతున్నదన్నారు. 32 ఏండ్లుగా లేని వివాదం కొత్తగా ఇప్పుడు ఎందుకు తెర మీదికి వచ్చిందో సులభంగా అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ‘నేను బాజాప్తా డబ్బులు పెట్టి కొన్న ఆస్తిపై అనవసర నిందలు వేస్తూ, ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. నేను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదు. నేను కొనుగోలు చేసిన భూమిపై ఎవరైనా విచారణ చేసుకోవచ్చు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. న్యాయపరంగా ఎదురోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని స్పష్టం చేశారు. తనపై, తమ పార్టీపై రాజకీయ కక్షతో బురద జల్లాలని చూస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. తప్పుడు ఆరోపణలు చేసి వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాలని చూస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.