కరీంనగర్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్కుమార్ తీవ్రంగా ఖండించారు. రేవంత్రెడ్డిని నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఇలాంటి వ్యక్తి సీఎం కావడం తెలంగాణ ప్రజల దురదృష్టమని పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్, మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక పోతున్నదని, రెండు నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని చెప్పారు. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని, పూర్తి అసమర్థతతో వ్యవహరిస్తున్నదని విమర్శించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలు నిలబెట్టుకోకుంటే ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కే పరిస్థితులు వస్తున్నాయని చెప్పారు. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచేందుకు వెళ్లిన తనపై మహారాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టిందని, ఈ నెల 28న కోర్టులో కేసు విచారణకు హాజరు కావాల్సి ఉన్నదని తెలిపారు. తామెన్నో త్యాగాలు చేస్తే తప్ప తెలంగాణ సుభిక్షం కాలేదని చెప్పారు. సమావేశాల్లో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కరీంనగర్ మేయర్ వై సునీల్రావు తదితరులు పాల్గొన్నారు.