వరంగల్: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ (Congress) అమలు చేయడం లేదని వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ (Vinay Bhaskar) అన్నారు. కాంగ్రెస్ నాయకులు తమపై నిందారోపణలు చేస్తున్నారని విమర్శించారు. నియోజవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని వెల్లడించారు. పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్నారు. తెలంగాణ కోసం ఓరుగల్లు పోరుగల్లులా కొట్లాడిందని చెప్పారు. ఓరుగల్లు గులాబీ సైన్యం త్యాగాలను తెలంగాణ ప్రజలు మర్చిపోరని తెలిపారు.
గులాబీ సైన్యమంతా కేసీఆర్ వెంటే ఉందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1.8 శాతం ఓట్ల తేడానే ఉందని వెల్లడించారు. అధికారం తమకు కొత్తేమీ కాదని, తెలంగాణ కోసం రాజీనామా చేసి ప్రజల్లో ఉన్నామని చెప్పారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు. నియోజకవర్గంలో గులాబీ శ్రేణులంతా పటిష్టంగా ఉన్నారని తెలిపారు.