అశ్వారావుపేట, నవంబర్ 8: రేవంత్ పెద్ద చీటర్ అని, రాజకీయ వ్యాపారుల ముఠాకు బాస్ అని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలోని ఓ ప్రైవేటు స్థలంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ జెండా మోసిన సీనియర్ నాయకులకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. రేవంత్, ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి జానారెడ్డి ఆహ్వానం మేరకు తాను రెండేండ్ల క్రితం కాంగ్రెస్లో చేరానని, అప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ను సమన్వయం చేసుకుంటూ పనిచేశానని చెప్పారు. పార్టీ చేపట్టిన సర్వే ప్రకారం మొదట టికెట్లు ఇస్తామని ప్రకటించిన రేవంత్.. ఇప్పుడు మాటతప్పారని మండిపడ్డారు. అశ్వారావుపేట టికెట్ను ప్రజామోదం లేని నేతకు ఇచ్చారని విమర్శించారు. రేవంత్ రాజకీయ వ్యాపారం చేసే వ్యక్తులకే ప్రాధాన్యమిస్తున్నారని, అందుకే గాంధీభవన్లో ఇప్పటికీ నిరసనలు కొనసాగుతున్నాయని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.