హైదరాబాద్, ఏప్రిల్18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట వద్ద బారికేడ్లను ఢీకొన్న కేసులో తనను అన్యాయంగా నిందితుడిగా చేర్చారని, తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్ హైకోర్టును ఆశ్రయించాడు. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ గురువారం నోటీసులు జారీచేశారు. తదుపరి విచారణను జూన్ 11కి వాయిదా వేశారు. ప్రమాదఘటన సమయంలో అకడ ఎలాంటి హెచ్చరిక సూచికలు లేవని, చీకటి కారణంగా బారికేడ్లను వాహనం ఢీ కొందని పిటిషనర్ న్యాయవాది చెప్పారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా కేసును పెద్దది చేసి 13 మందిని నిందితులుగా చేర్చారని, అక్రమంగా నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతివాదన చేస్తూ విదేశాల నుంచి వచ్చిన పిటిషనర్ను పోలీసులు అరెస్ట్ చేశారని, కింది కోర్టు బెయిల్ మంజూరు చేసిన కారణంగా పిటిషన్లో ఏవిధమైన ఉత్తర్వులు జారీ అవసరం లేదని చెప్పారు. కేసు విచారణ దర్యాప్తును కొనసాగించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దర్యాప్తు నిలిపివేతకు నిరాకరించింది. ఇదే కేసులో మరో నిందితుడు నాని వేసిన పిటిషన్ను కూడా హైకోర్టు విచారించి పోలీసులకు నోటీసులు ఇచ్చింది.