మడికొండ, ఏప్రిల్ 16: ‘బిడ్డా కడియం కాస్కో.. ఇక నుంచి మన ఇద్దరి మధ్య కబడ్డీ.. కబడ్డే. స్టేషన్ఘన్పూర్లో నువ్వు చేసిన అభివృద్ధి, నేను చేసిన అభివృద్ధిపై బహిరంగచర్చకు సిద్ధమా?’ అంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య తొడకొట్టి సవాల్ విసిరారు. మంగళవారం హనుమకొండ జిల్లా మడికొండలో వరంగల్ పార్లమెంట్ పరిధిలోని స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి సుధీర్కుమార్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. విదేశాల్లో కడియం శ్రీహరి అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారని, వాటికి కడియం కావ్య, ఆమె భర్త నజీర్ బినామీలని ఆరోపించారు.
మంత్రిగా ఉన్నప్పుడు డీఈవో బదిలీల్లో రూ.2 కోట్లు, లింగంపల్లి ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ వద్ద రూ.6 కోట్లు లంచం తీసుకున్నారని విమర్శించారు. ‘నేను మాదిగ బిడ్డను. రానున్న ఎన్నికల్లో డప్పు కొట్టి నీ బండారాన్ని బయటపెడుతా. నిన్ను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో గెలిచి పాతాళానికి తొకేస్తా’ అంటూ తీవ్రంగా హెచ్చరించారు.
అనంతరం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. దుర్మార్గులకు, మంచికి మధ్య జరుగుతున్న పోరాటంలో మంచి తప్పకుండా గెలుస్తుందని చెప్పారు.మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ కడియంకు దమ్ముంటే రాజీనామా చేసి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్ మాట్లాడుతూ.. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీస్సులతో పోటీలో నిలిచానని, ప్రజలు ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తే నిజాయితీతో పనిచేస్తానని పేర్కొన్నారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, నాయకులు రాకేశ్రెడ్డి, కార్పొరేటర్ రాధికరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.