హైదరాబాద్, సెప్టెంబర్ 5 : కేసీఆర్ అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram project) నిర్మించి ప్రపంచమే అబ్బురపడేలా చేశారు. లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చిన తెలంగాణ జల స్ఫూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం అపకీర్తి తెస్తోందని మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ సజీవ జల దృశ్యాన్ని అదృశ్యం చేసేలా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని నీలాపనిందలు వేసి కేసీఆర్ పై సీబీఐ విచారణ కోరడం రాష్ట్ర ఆత్మగౌరవానికే తలవంపు అని ఆయన శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ కొంగు బంగారం..
కాళేశ్వరం జల సింగారం తెలంగాణ కొంగు బంగారమని ఆయన అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీలు సృష్టించిన అపోహలను అనేక వేదికల ద్వారా తొలగించినా అదేపనిగా విషం కక్కుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ఇచ్చిన నివేదిక కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదని అర్థమై తాజాగా సీబీఐ విచారణ అంటూ సరికొత్త మోసానికి తెరదీశారని ఆయన ఎద్దేవా చేశారు. ఆది నుంచి తెలంగాణ విలన్ పాత్ర పోషించిన కాంగ్రెస్ నేతలు కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పాలన చూసి కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
ఓర్వలేక ఒక్కటై కక్షగట్టారు..
తడారి ఎడారిగా మారిన తెలంగాణ భూములు పచ్చ బారెలా చేసిన కాళేశ్వరం జలధారలు చూసి కాంగ్రెస్ నాయకుల కళ్లు ఎర్రబారుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం బాగుపడటం ఓర్వలేని ద్రోహులంతా ఒక్కటై కేసీఆర్పై కక్ష గట్టారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చి దశాబ్దాల కల నెరవేర్చడమే కాక అద్భుతమైన పాలనతో అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన తొలి సీఎం కేసీఆర్పై కక్ష సాధింపులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు.
కుట్రలను తిప్పికొడుతం..
పచ్చని తెలంగాణను మళ్లీ ఎండబెట్టే కుట్రలు చేస్తున్నారని, తెలంగాణకు దక్కాల్సిన నీటిని ఆంధ్రప్రదేశ్కు తరలించే ఎజెండాతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రేవంత్, మోడీ, చంద్రబాబు కుయుక్తులను ఎండగడతం.. కేసీఆర్ జోలికొస్తే తెలంగాణ ప్రజలు తిరగబడుతారు అని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ కుట్ర రాజకీయాలను ఎదుర్కోవడానికి ప్రజలతో కలిసి మహాయుద్ధం చేయడానికి గులాబీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని జీవన్రెడ్డి పేర్కొన్నారు.