హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): కల్వకుర్తి సభలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్రెడ్డి పేరు పెట్టిన సీఎం రేవంత్రెడ్డి, రెండున్నరేండ్లు దాటినా ఎందుకు పూర్తిచేయడంలేదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టును పూర్తిచేసి 12 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని ప్రగల్భాలు పలికి ఇప్పుడు ప్రజలను తప్పుదోవపట్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు.
రేవంత్రెడ్డితో చర్యలతో జైపాల్రెడ్డి ఆత్మ ఘోషిస్తున్నదని ధ్వజమెత్తారు. ఆయన పేరు, ప్రతిష్టలను వాడుకొని వదిలేశారని దుయ్యబట్టారు. బుధవారం తెలంగాణ భవన్లో మాట్లాడారు. రేవంత్రెడ్డి పాలమూరు బిడ్డ అని చెప్పుకొనేందుకు సిగ్గేస్తున్నదని దెప్పిపొడిచారు. పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసే అవకాశాన్ని ఆయన దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. అహంకారంతో మాట్లాడటం తప్ప రేవంత్ సాధించిందేమీలేదని విమర్శించారు.
పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ మండలం పెంట్లవెళ్లి మండలంలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగుతున్నదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ఆరోపించారు. దీనివెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నదని స్పష్టంచేశారు. అరికట్టాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శించారు. మంత్రి జూపల్లి నీతులు చెబుతూ చోద్యం చూస్తున్నారని విరుచుకుపడ్డారు. వెంటనే ముఖ్యమంత్రి స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ గద్దెనెక్కి తిట్లతోనే రెండున్నరేండ్లు దాటిందని, అయినా ఉద్ధరించిందేమీలేదని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలను నిలువునా ముంచిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దొడ్డిదారిలో గెలిచిన ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని మరచిపోయారని ఎద్దేవాచేశారు. కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుగుతున్నారని మండిపడ్డారు. కేసులు పెట్టడంలో ఆయనకు గోల్డ్ మెడల్ ఇవ్వొచ్చని చురకలంటించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చి తన సొంతగ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ పక్కనపెడుతున్నారని ఆరోపించారు.