సంగారెడ్డి, జూలై 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఇక్కడి విషయాలన్నీ తాను నేరుగా రాహు ల్ గాంధీకి చేరవేస్తున్నట్టు చెప్పారు. బుధవా రం సంగారెడ్డిలో కాంగ్రెస్ బూత్లెవల్ ఏజెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా తన మనసు లో ఓ కోరిక ఉన్నదని, దాన్ని నవంబర్లో బ యటపెడుతానని స్పష్టంచేశారు. రాహుల్కు మాట ఇవ్వటం వల్లే తాను మూడున్నరేండ్లు గా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలు, పార్టీ అంతర్గత రాజకీయాలపై ఏం మాట్లాడంలేదని పేర్కొన్నారు. మూడున్నరేండ్ల క్రితం పార్టీ అంశాలపై అప్పట్లో బహిరంగంగా, అంతర్గతంగానూ చర్చించినట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాల్లో తాను లేవనెత్తిన అంశాలు బయటకు వస్తుండటంతో కొంతకాలంగా తాను పీఏసీ సమావేశాలకు హాజరుకావటం లేదని అన్నా రు. ‘మీరు పార్టీకి సంబంధించి ఏ విషయమైనా మీడియా ముందు మాట్లాడొద్దు. ఢిల్లీకి వచ్చి నేరుగా నాతో చెప్పాలి’ అని రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు ముందు రాహుల్గాంధీ తనకు సూచించారని, ఆ మేరకు ఎప్పటికప్పుడు పార్టీ వ్యవహారాలను ఆయనకు నేరుగా చేరవేస్తున్నట్టు చెప్పారు.