జయశంకర్ భూపాలపల్లి : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం లింగాల గ్రామంలో రైస్ మిల్ వద్ద రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
ఆరుగాలం కష్టపడి రైతులు పంటలు పండిస్తే ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోళ్లు చేపట్టకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.