జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లిలో ప్రజల కోసం, లోక కల్యాణార్థం నిర్మించిన వేకటేశ్వర స్వామి ఆలయం (Venkateswara Swamy temple) పై రాజకీయం చేయడం ఇకైనా మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెకంట రమణారెడ్డి (Former MLA Gandra) పేర్కొన్నారు. ఆదివారం భూపాలపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. భూపాలపల్లిలో నిర్మించిన వేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి జరుగుతున్న నిర్మాణాలను నిలిపివేయాలని మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసులపై హైకోర్టులో పిల్ వేయగా.. పరిశీలించిన హైకోర్టు నోటీసులను రద్దు చేస్తూ నిర్మాణాలు జరుపుకోవడానికి అనుమతినిచ్చిందన్నారు. ఇప్పటికైనా గెలిచిన ఎమ్మెల్యే గుడిపై రాజకీయం చేయడం మానుకోవాలన్నారు.
ఆలయానికి సంబంధించిన ప్లాన్ అధికారులందరికి తెలుసని, శంకుస్థాపన, విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో కలెక్టర్తో పాటు రెవెన్యూ అధికారులందరూ పాల్గొన్నారని తెలిపారు. నిర్మాణాలన్నీ అధికారులకు తెలిసే జరిగాయని, తానేమీ దాచలేదన్నారు. ఏడాది తర్వాత అక్రమ నిర్మాణాలని, అనుమతులు లేవని, స్థలానికి సంబంధించి కేసు కోర్టులో ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిందే అదునుగా వ్యక్తిగత కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నారన్నారు. ఇప్పటికైనా ఆలయంపై కుట్రలు ఆపాలని వెంకటరమణారెడ్డి సూచించారు.