ఖలీల్వాడి, ఏప్రిల్ 20: కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, దగాకోరు పాలన ఫలితంగా రాష్ట్రంలో రైతుల మరణ మృదంగం మార్మోగుతున్నదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలను బొందపెట్టిన కాంగ్రెస్ పాలనపై రోజురోజుకూ ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నదని ఆరోపించారు. ప్రజలే ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలపై తిరుగుబాటు చేస్తున్నారని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ను పాతిపెట్టిన రేవంత్ సర్కార్.. రైతుబంధును అమలు చేయకపోవడం, కాళేశ్వరాన్ని పండబెట్టి పంటలు ఎండబెట్టడం, రుణమాఫీ చేయకపోవడంతో వ్యవసాయం కుప్పకూలి రైతన్న సతమతమవుతున్నాడని ఆందోళన వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ నిర్లక్ష్య పాలనతో ఇప్పటికే దాదాపు 500 మంది రైతులు ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ భూదాహానికి మూగజీవులు సైతం బలవుతున్నాయని ఆవేదన చెందారు. సర్కారు మోసాలను నిలదీస్తున్న ప్రజలపై కాంగ్రెస్ పొట్టేళ్లు దాడి చేస్తున్నాయని విమర్శించారు. ఇటీవల భీమ్గల్ వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావును కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఏమైందని అడిగినందుకు కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యానికి దిగడం దారుణమని అన్నారు. బీఆర్ఎస్ జెండా పట్టినా, ఫ్లెక్సీ కట్టినా జైలుపాలు చేయడం, ధర్నా చేసినా, ఇంట్లోనే ఉన్నా నిర్బంధాలు అమలు చేయడం రేవంత్ ప్రభుత్వంలో నిత్యకృత్యంగా మారినట్టు తెలిపారు. ప్రభుత్వం బీఆర్ఎస్ శ్రేణులపైకి పోలీసులను ఉసిగొల్పుతున్నదని మండిపడ్డారు. కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసినా కేసు పెడుతున్నారని, అప్రకటిత ఎమర్జెన్సీ పడగనీడలో రాష్ట్రం బిక్కుబిక్కుమంటున్నదని తెలిపారు. కాంగ్రెస్ సర్కారుకు పోయే కాలం దాపురించిందని, రేవంత్రెడ్డి సాగిస్తున్న దుష్టపాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజు ఎంతో దూరంలో లేదని హెచ్చరించారు.