మాగనూర్, జూన్ 22 : ‘మాగనూర్ పెద్దవాగును రాఘవ కన్స్ట్రక్షన్స్ గుల్ల చేస్తున్నది. మంత్రి బంధువుల కంపెనీ కావడంతో ప్రభుత్వ అండతో యథేచ్ఛగా వాగును తోడేస్తున్నారు’ అని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. నారాయణపేట జిల్లా మాగనూర్ మండల కేంద్రానికి సమీపంలోని పెద్దవాగు నుంచి నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పనులకు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపుపై ధ్వజమెత్తారు. సోమవారం పెద్దవాగు వద్దకు వెళ్లిన ఆయన ఇసుక తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొడంగల్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి బంధువులకు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నదని ఆరోపించారు. మరోవైపు మంత్రి వాకిటి శ్రీహరి అండదండలతో కృష్ణానది పరీవాహక ప్రాంతం నుంచి రాత్రింబవళ్లు ఇసుక తరలిస్తూ కొందరు నేతలు అక్రమ సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
పలుమార్లు ఇసుక తరలింపుపై స్థానికులు అభ్యంతరం వ్యక్తంచేసినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దీంతో తానే స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చిందని తెలిపారు. ఇసుక దందాకు అధికారులు, పోలీసులు సహకారం అందిస్తున్నారని మండిపడ్డారు. కృష్ణ మండలంలో ఇసుక అక్రమంగా తరలిపోతున్నదని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తూ ‘అడ్డొస్తే అంతు చూస్తాం’ అంటూ మాఫియా బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నారాయణపేట కలెక్టర్ సీహెచ్ ప్రియాంకను కలిసి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి వినతిపత్రం అందజేశారు. నదీ తీరప్రాంతంలో అనుమతులు లేకుండా.. మాగనూరు మండలం ఉజ్జల్లికి చెందిన శ్రీనివాస్రెడ్డి ఇసుక తరలిస్తుండటంతో బీఆర్ఎస్ నేత శివరాజ్పాటిల్ అడ్డుకునేందుకు యత్నంచేశాడని తెలిపారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతకు ఈ నెల 18న రాత్రి శ్రీనివాస్రెడ్డి బంధువులు సురేశ్రెడ్డి, ఈశప్ప, భీమన్న ఫోన్చేసి బెదిరింపులకు పాల్పడ్డారని, వీరిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.