మోర్తాడ్, నవంబర్ 7: అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన పలు కార్యక్రమాలకు వెళ్తూ మార్గమధ్యంలో నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ వద్ద ఆగారు. వడ్లను ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్న రైతుల వద్దకు వెళ్లి మాట్లాడారు. ప్రభుత్వమే క్వింటాలుకు రూ.2,800 ధరతోపాటు అదనంగా రూ.500 బోనస్ ఇచ్చి కొంటామంటుండగా, ప్రైవేటు వ్యాపారులకు ఎందుకు అమ్ముకుంటున్నారని రైతులను ప్రశ్నించారు.
కల్లాల మీదికి వడ్లు తీసుకువచ్చి 20 రోజులు గడుస్తున్నదని, ప్రభుత్వం బోనస్ ఇచ్చి వడ్లు కొంటుందన్న నమ్మకం లేక వ్యాపారులకు అమ్ముకుంటున్నామని రైతులు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం ఆలస్యమైనందున, ఇప్పటికే ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్న రైతులకు కూడా క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించి కొనుగోలు చేయాలని సూచించారు. దళారులకు అమ్ముకున్న వడ్లకు కూడా బోనస్ చెల్లించాలని అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే అన్ని రకాల వడ్లకు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు.