హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తరహాలో కర్ణాటక రాష్ట్రంలోనూ కులవృత్తులను పునరుద్ధరించాలని, అక్కడి వైన్స్ల్లో రిజరేష్వన్లు కల్పించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ కోరారు. కర్ణాటకలో కులవృత్తుల పునరుద్ధరణ కోసం సేడం నుంచి బెంగళూరు వరకు ప్రణవానంద స్వామి ఆధ్వర్యంలో చేపట్టిన 700 కిలోమీటర్ల పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి శ్రీనివాస్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కర్ణాటక బీసీ శాఖ మంత్రి శివరాజ్ తంగడగికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందచేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. కర్ణాటక విధానసభ ప్రాంగణంలో నారాయణగురు విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని, నారాయణ గురుట్రస్ట్కు అక్కడి ప్రభుత్వం వెంటనే రూ.500 కోట్లు విడుదల చేయాలని కోరారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కర్ణాటక మాదిరిగానే ఉండేదని, కానీ, పోరాడి రాష్ర్టాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో కులవృత్తుల పునరుద్ధరణ జరిగిందని గుర్తుచేశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మలికయ్య గుత్తేదార్, మాజీ ఎమ్మెల్యే శ్రీనాథ్, సతీష్ గుత్తేదార్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.