నిజామాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒక పార్టీలో గెలిచినవారు ఎవరైనా మరో పార్టీలోకి వెళ్తే, వారిని రాళ్లతో కొట్టి చంపాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారని, ఇప్పుడు ఆయనే ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పుడు ఎవరిని రాళ్లతో కొట్టాలో చెప్పాలని ప్రశ్నించారు.
కడియం శ్రీహరి, కేశవరావు, రంజిత్రెడ్డి, మహేందర్రెడ్డి, దానం నాగేందర్కు కండువా కప్పినందుకు రేవంత్ రాళ్ల దెబ్బలకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన అర్బన్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో వేముల మాట్లాడుతూ.. పార్టీ మారేవాళ్లను పిచ్చికుక్కను కొట్టినట్టు కొట్టాలన్న రేవంత్రెడ్డి.. ఇప్పుడు పిచ్చికుక్క ఎవరో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీకి ఎంపీ అభ్యర్థులు లేకనే బీఆర్ఎస్ నేతలను తీసుకెళ్తున్నారని ఎద్దేవా చేశారు.
అర్వింద్కు సుదర్శన్రెడ్డి, జీవన్రెడ్డి సహకారం
గత లోక్సభ ఎన్నికల్లో కల్వకుంట్ల కవితను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయని, ఇప్పుడు కూడా అర్వింద్ను గెలిపించేందుకు మరో కుట్రకు తెరలేపారని ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, ఎంపీ అర్వింద్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, అందుకే కాంగ్రెస్ అభ్యర్థిగా జగిత్యాలకు చెందిన జీవన్రెడ్డిని నిలబెడుతున్నారని చెప్పారు.
మైనార్టీ ఓటర్లు ఈ అక్రమ సంబంధాన్ని గుర్తించాలని విజ్ఞప్తిచేశారు. గత ఐదేండ్లలో ఈ ప్రాంతం ముఖమే చూడని ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి ఓటు వేయడం వృథా అని చెప్పారు. ఎవరు ఎన్ని చేసినా బీఆర్ఎస్ గెలుపు తథ్యమన్నారు. కాలు మంచిగా లేకున్నా, బిడ్డ జైలులో ఉన్నా కేసీఆర్ రైతుల కోసం బయటకు వచ్చి ప్రభుత్వ కుట్రలను బట్టబయలు చేస్తున్నారని వివరించారు.
త్వరలోనే బీజేపీలోకి రేవంత్రెడ్డి
మొన్న మోదీ ఎదుట గుజరాత్ అభివృద్ధి బాగున్నదని, తెలంగాణలో గుజరాత్ మాడల్ తెస్తానని చెప్పిన రేవంత్రెడ్డి మాటను ప్రజలు గమనించాలని వేముల విజ్ఞప్తి చేశారు. బడే భాయ్, చోటే భాయ్ ఏకీ హై.. త్వరలోనే రేవంత్రెడ్డి కాంగ్రెస్ను బొందపెట్టి బీజేపీలోకి వెళ్తారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉన్నదని తెలిపారు.