నాగర్కర్నూల్ : సమస్యలపైన, సమాజం పట్ల పట్టు ఉన్న వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను(RS Praveen Kumar )గెలిపించాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్(Nagar Kurnool) పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను కాంక్షిస్తూ వనపర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు.
ఐపీఎస్ అధికారిగా ప్రవీణ్ కుమార్ ప్రజల కోరిక మేరకు పనిచేసి శభాష్ అనిపించుకున్నారు. బీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు శ్రమించాలన్నారు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కానీ హామీలే ఇచ్చింది. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన బండారం బయటపడుతుందన్నారు. కేవలం 100 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో అభాసు పాలయిందన్నారు.
హామీల అమలు చేయలేక ఎన్నికల కోడ్ అంటూ మంత్రులు తప్పించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రెండు జాతీయ పార్టీలు ఉద్యమ నేత కేసీఆర్ పై దండెత్తుతున్నాయి. కేంద్రంలో అధికారం పేరు చెప్పి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండండి, భవిష్యత్ మనదేనని భరోసానిచ్చారు.
పదేళ్లలో బీజేపీ పాలనలో రాష్ట్రానికి చేసింది శూన్యమన్నారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే మోసపోతాం. రూ.2 లక్షల రూపాయల రుణమాఫీ, రూ.4,000 పెన్షన్, తులం బంగారం ఇవ్వకపోయినా ప్రజలు అంగీకరించారు అంటారు. కాబట్టి, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి. దీనిపైన ప్రతి గ్రామంలో చర్చ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.