వనపర్తి, జనవరి 27: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంలో కొంత వెనుకబడిపోయామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం వనపర్తిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తల సమావేశంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల వ్యుహ రచనపై అభిప్రాయ సేకరణ చేశారు.
ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి ఫలాలు అందిస్తే చాలు విజయం సాధిస్తామన్న ఆలోచనలో అడుగులు వేశామని, కొంత ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండలేకపోయామని తెలిపారు. కానీ, ఇప్పుడు కార్యకర్తలకు ఎలాంటి సమస్యలు ఉన్నా.. ఎనీ టైం అండగా ఉంటామని భరోసానిచ్చారు. సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం అన్ని రకాలుగా అభివృద్ధి చేసిందని, కానీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంతో తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు.
అనంతరం మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో మాదిరిగానే బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలపై ప్రజలకు రోజురోజుకూ విశ్వాసం సన్నగిల్లుతున్నదని పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, నాయుడు నాగం తిరుపతిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, నాయకులు పాల్గొన్నారు.