సూర్యాపేట, మార్చి 12 (నమస్తే తెలంగాణ): హామీలు అమలు చేయకపోతే ప్రజలే కాంగ్రెస్ గేట్లు బద్దలు కొట్టేలా ఉన్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి హెచ్చరించారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎమ్మెల్యేలను కొనేందుకు గేట్లు తెరవడం కాదు, ఎండుతున్న పంటలను కాపాడేందుకు నాగార్జునసాగర్, శ్రీశైలం, కాళేశ్వరం గేట్లు ఎత్తాలని సూచించారు. గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై సూర్యాపేటలో ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. ఎమ్మెల్యేలను కొనాలనే సోయి తప్ప ప్రజల కష్టాలపై కాంగ్రెస్కు పట్టింపు లేదని మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే కరువొచ్చేది కాదని పేర్కొన్నారు. ఇప్పటికైనా దమ్ముంటే సాగునీరు ఇవ్వాలని హితవు పలికారు. కుంగిన మేడిగడ్డ పిల్లర్లకు, నీళ్లు ఎత్తి పోసుకోవడానికి సంబంధం లేదని, ఇవాళ్టికి కూడా కాళేశ్వరంలో నాలుగు వేల క్యూసెక్కుల నీటి లభ్యత ఉన్నదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు తమ కర్ణాటక మిత్రులతో మాట్లాడి కృష్ణా నది నుంచి పది టీఎంసీల నీటిని తెప్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణమ్మ పాల్గొన్నారు.