కరీంనగర్ కార్పొరేషన్, జూలై 12 : ఓ వైపు రాష్ట్రంలో కరువు పరిస్థితులు భయపెడుతుంటే సీఎం రేవంత్రెడ్డి మాత్రం కేసీఆర్కు పేరొస్తుందనే అక్కసుతో రైతులను అరిగోస పెడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. కక్షసాధింపు చర్యలు మానుకొని వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లోని ఓ హోటల్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల కోసం రిటైర్డ్ ఇంజినీర్లు ఇచ్చిన సలహాలను ప్రభుత్వం స్వీక రించాల్సింది పోయి, వారిని జైలుకు పంపాలంటూ మాట్లాడటం సీఎం రేవంత్రెడ్డి అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు.
ఒక బాధ్యతగల ప్రభుత్వం అయితే కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే అంశంపై సాంకేతికంగా సాధ్యాసాధ్యాలను ప్రజలకు వివరిస్తూ అధికారులతో వివరణ ఇప్పించాలి కానీ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని నిప్పులుచెరిగారు. కుంగిన పిల్లర్లకు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ కూడా మరమ్మతులు చేసేందుకు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. మేధావులపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్సింగ్, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్సింగ్ పాల్గొన్నారు.