హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలపై సమరభేరి మోగించాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వైఫల్యాలు, మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ విస్తృత నిరసన ప్రణాళికను ప్రకటించిందని వివరించారు.
ప్రభుత్వ వైఫల్యాలపై సెప్టెంబర్ 2న చార్జ్షీట్ విడుదల చేసి నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 3న రైతు సదస్సులు, 5వ తేదీన యూత్ ర్యాలీలు, సెప్టెంబర్ 6న సింగరేణి మైన్స్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. ‘కాంగ్రెస్ బాకీ కార్డుల‘ను ఇంటింటికీ పంపిణీ చేసి ప్రజాపోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సోమవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. రైతు, యూత్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ల పేరుతో ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మభ్యపెట్టారని, కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగపత్రాలను మాత్రమే కాంగ్రెస్ సర్కార్ పంపిణీ చేస్తున్నదని విమర్శించారు. రైతులకు యూరియా దొరుకని పరిస్థితి ఏర్పడిందని, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు రూ.నాలుగు వేల పింఛన్ ఇస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ వంటి పథకాలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ వర్గం చూసినా కాంగ్రెస్ పాలనపై అసంతృప్తితో ఉన్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రజా సమస్యలను గాలికొదిలేసి… కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు పట్ల విపరీత ధోరణితో వ్యవహరిస్తున్నారని, సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో రాష్ర్టాన్ని సుభిక్షమైన వ్యవసాయ క్షేత్రంగా మార్చితే, కాంగ్రెస్ సర్కార్ సంక్షోభంలోకి నెట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలపై మండిపడ్డ కొప్పుల ఈశ్వర్
హరీశ్రావుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ చేసిన వ్యాఖ్యలను కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండించారు. తొలిసారి ఎమ్మెల్యే, మంత్రి అయిన అడ్లూరి ముందు తన శాఖలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలని హితవు పలికారు. అడ్లూరి శాఖలో రూ.2వేల కోట్ల కుంభకోణం జరిగిందని, గుజరాత్ కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టారని హరీశ్రావు ఆధారాలతో బయటపెట్టారని గుర్తుచేశారు. దీనికి సమాధానం చెప్పలేక గన్పార్ వద్ద బహిరంగ చర్చకు రమ్మంటే అడ్లూరి పారిపోయారని ఎద్దేవా చేశారు. సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు చిరుమళ్ల రాకేశ్కుమార్, దామోదర్గుప్తా, టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్గౌడ్ పాల్గొన్నారు.