Jupally Krishna Rao | హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు మళ్లీ రిక్త‘హస్త’మే ఎదురైంది. కాంగ్రెస్ కండువా కప్పుకోకముందే ఆ పార్టీ పెద్దలు ఆయనకు చుక్కలు చూపిస్తున్నారు. తాను హస్తంగూటికి చేరేందుకు రెండుసార్లు ప్లాన్ చేసుకొన్న సభలు వాయిదాపడటంతో జూపల్లి తీవ్ర అసహనానికి గురవుతున్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఎంతో ఉత్సాహంగా ఉన్న ఆయన ఇప్పుడు నిరాసక్తతతో కనిపిస్తున్నారు. జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మొదట ఈ నెల 20న ముహూర్తం ఫిక్స్ చేశారు. కొల్లాపూర్లో భారీ బహిరంగ సభ ద్వారా హస్తం పార్టీలో చేరాలని భావించారు. కానీ ఆ సభకు వచ్చేందుకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సమయం ఇవ్వలేదని తెలిసింది. దీంతో సభను వాయిదా వేసుకొన్నారు. తిరిగి ఈ నెల 30న సభ నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ సారి కూడా వర్షాల సాకుతో కాంగ్రెస్ పార్టీ సభను మరోసారి వాయిదా వేసింది. దీంతో జూపల్లి నారాజ్ అయినట్టు తెలిసింది. స్థానికం గా సభ వాయిదాను ప్రకటించిన సమయంలో ఆయన ముఖంలో అసంతృప్తి కొట్టిచ్చినట్టు కనిపించిందని ఆ పార్టీ లీడర్లే గుసగుసలాడడం గమనార్హం. ఇదిలా ఉండగా, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్లో చేరేందుకు ఏర్పాటు చేసుకొన్న సభ రెండుసార్లు వాయిదాపడడం తో దీని వెనుక అదృశ్య ‘హస్తం’ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సభను నిర్వహించేందుకు తా ను సిద్ధం గా ఉన్నానని, ఎలాంటి వాతావరణ పరిస్థితులున్నా అధిగమించేలా ఏర్పాట్లు చేస్తానని జూపల్లి చెప్పినా రాష్ట్రస్థాయి నేతలతోపాటు అక్కడి స్థానిక నేతలు సభను వాయిదా వేయాలని పట్టుబట్టినట్టు తెలిసింది. దీంతో కావాలనే తన చేరిక సభను వాయిదా వేస్తున్నారని జూపల్లి గుర్రుగా ఉన్నట్టు తెలిసింది.