Harish Rao | హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ శాసనసభలో సోమవారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రతిపక్ష పార్టీ తరఫున శాసనసభలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్(కేఆర్ఎంబీ) తీర్మానంపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ తరఫున మాట్లాడిన మాజీ మంత్రి హరీశ్రావు అధికారపక్షాన్ని అల్లాడించారు. సీఎం సహా 8మంది మంత్రులకు సమాధానమిచ్చి అష్టావధాని అనిపించుకున్నారు. ఆయన సమాధానాలతో ఆత్మరక్షణలో పడిపోయిన అధికారపక్షానికి ఏం చేయాలో అర్థంకాక చివరికి కామెంట్లు మొదలుపెట్టింది. వాటికి కూడా హరీశ్ దీటుగా సమాధానమిచ్చారు. అసెంబ్లీ సమావేశాల లైవ్ చూస్తున్నవారు హరీశ్ మాట్లాడుతుంటే కదలకుండా వీక్షించారు. కృష్ణా జలాల్లో తెలంగానకు జరిగిన అన్యాయం గురించి చెప్తూనే తన ప్రసంగానికి అడ్డువచ్చిన వాళ్లను కూడా తూర్పారబట్టారు.
పంచ్ డైలాగులతో సమాధానాలు
సభలో హరీశ్రావు మాట్లాడుతూ పంచ్ డైలాగులతో అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. “ప్రభుత్వం కేఆర్ఎంబీ గురించి చెప్తూ రూపొందించిన పుస్తకానికి అవాస్తవాల పుస్తకం అని పేరు పెట్టండి. మేం మీలా ప్రిపేర్ కాకుండా రాలేదు. మంచిగ ప్రిపేర్ అయి వచ్చినం. మీరు అడిగిన ప్రతీదానికి ఆన్సర్ చేస్తాం’, ‘స్పీకర్గారూ.. ఇప్పుడు రేవంత్రెడ్డిగారు కూడా తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉన్నది’, ‘వెంకన్నా కొంచెం ఓపిక పట్టు.. అన్నింటికీ ఆన్సర్ చెప్తా..ఎందుకు ఇట్ల మాట్లాడుతున్నవే. బీపీ పెరిగినట్టుంది. బయటకు వెళ్లి ఒక బీపీ గోళీ వేసుకొని రా’, ‘ఉత్తమన్న సీఎం కాలేదన్న ఫ్రస్టేషన్లో ఉన్నట్టున్నడు’.. వంటి పంచ్డైలాగులు అనేకం వేశారు. ఒక దశలో హరీశ్రావును కట్టడి చేసేందుకు అధికారపక్షం నుంచి అనేక మందిని ప్రయోగించారు. ఒకరి తర్వాత ఒకరుగా మంత్రులు హరీశ్ను వెంటాడారు. అయినప్పటికీ ఆయన ఏమాత్రం తొణకలేదు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తలోవైపు హరీశ్ను ప్రశ్నలతో, ఎదురుదాడితో నిలువరించే ప్రయత్నం చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కూడా మైక్ తీసుకొని మాట్లాడారు. హరీశ్ ప్రసంగాన్ని మొత్తం 25 సార్లు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. సోమవారం సభ మొదలైనప్పటి నుంచి ముగిసేవరకు హరీశ్రావు కేంద్రంగానే సభ జరిగిందంటే అతిశయం కాదు. చివరకు హరీశ్రావు ప్రశ్నలు అడుగుతుంటే మంత్రులు సమాధానం చెప్పలేక విషయాన్ని కేసీఆర్పై వ్యక్తిగత విమర్శలు చేసే స్థాయికి వెళ్లారు.
కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు
హరీశ్రావు ప్రసంగంపై కేటీఆర్ ‘ఎక్స్’వేదికగా స్పందించారు. హరీశ్ అద్భుతంగా మాట్లాడారని, కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలను పటాపంచలు చేశారని, కృష్ణాజలాలు, కేఆర్ఎంబీ గురించి కాంగ్రెస్ చెప్తున్నది సత్యదూరమని సాక్ష్యాధారాలతో సహా చెప్పారని ప్రశంసించారు. మంగళవారం నల్లగొండ బహిరంగ సభలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలను, రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ఎండగడ్తారని పేర్కొన్నారు.