హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : పెంచిన టెట్ ఫీజును వెంటనే తగ్గించాలని మాజీ మంత్రి టీ హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. టెట్ ఫీజును భారీగా పెంచడం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించడంపై నిరుద్యోగులను మోసం చేయడమేనని ఆ లేఖలో పేర్కొన్నారు. నిరుద్యోగ అభ్యర్థుల నుంచి అధిక ఫీజు వసూలు చేయడం బాధాకరమని, దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టంచేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, టెట్ ఒక పేపర్ రాసినా, రెండు పేపర్లు రాసినా రూ.400 మాత్రమే ఫీజు తీసుకోగా, ఈ ఏడాది ఒక పేపర్కు రూ.1000, రెండు పేపర్లకు రూ.2000 ఫీజుగా వసూలు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ ఫీజులు సీబీఎస్ఈ నిర్వహించే సీ టెట్ తో పోల్చితే డబుల్గా ఉన్నాయని వివరించారు. రిజర్వుడ్ విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పించకుండా జనరల్ క్యాటగిరీ విద్యార్థులతో సమానంగా ఒకే తరహా ఫీజులను అమలు చేయడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని తెలిపారు.
టెట్ ఫీజుల పెంపు, రిజర్వుడ్ విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పించకపోవడాన్ని నిరసిస్తూ బీఈడీ, డీఎడ్ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా పోరాడుతున్నారని, పుస్తకాలు వదిలి రోడ్డకెకి ఉద్యమిస్తున్నారని లేఖలో వివరించారు. అయినా ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదని తెలిపారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా మీ సోకాల్డ్ ప్రజా పాలన? అంటూ హరీశ్ రావు తన లేఖలో నిలదీశారు.
నిరుద్యోగుల నుంచి రూపాయి ఫీజు తీసుకోకుండా దరఖాస్తులు స్వీకరిస్తామని, మ్యానిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్.. ఇప్పుడు ఫీజుల పేరుతో నిరుద్యోగుల నడ్డివిరిచడం ఏమిటని ప్రశ్నించారు.ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, వెంటనే టెట్ ఫీజులు తగ్గించాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకొంటే నిరుద్యోగుల తరఫున పోరాడుతామని హెచ్చరించారు.