హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): పాడి రైతులకు 45 రోజుల పెండింగ్ బిల్లులు రూ.80 కోట్లను తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 15 రోజులకు ఒకసారి బిల్లులు చెల్లించేదని, కాంగ్రెస్ ప్రభుత్వం 45 రోజులైనా బిల్లులు చెల్లించడం లేదని విమర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాశారు. 45 రోజులు బిల్లులు చెల్లించకపోతే పాడి రైతులు బతికేది ఎలా? అని ప్రశ్నించారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు, కిస్తీలు ఎలా కడతారు? అని నిలదీశారు. రేవంత్రెడ్డికి హరీశ్రావు రాసిన లేఖ పూర్తిపాఠం ఇది.. ‘రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మందికిపైగా పాడి రైతులు పాల ఉత్పత్తి సహకార సంఘాలుగా ఏర్పడి, ప్రభుత్వం నడిపే విజయ డెయిరీకి నిత్యం పాలు పోస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీ 15 రోజులకు ఒకసారి పాడి రైతులకు బిల్లులు చెల్లించేది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో బిల్లుల చెల్లించడం లేదు. 45 రోజుల పాల బిల్లులు పెండింగులో ఉన్నాయి. దాదాపు రూ.80 కోట్ల వరకు ప్రభుత్వం పాడి రైతులకు చెల్లించాల్సి ఉన్నది. బ్యాంకుల్లో, మహిళా సంఘాల్లో, వడ్డీ వ్యాపారుల దగ్గర వివిధ మార్గాల ద్వారా అప్పు చేసి పాడి రైతులు పశువులు కొనుగోలు చేశారు. అప్పుల కిస్తీలు క్రమం తప్పకుండా కట్టుకోవాల్సి ఉన్నది.
పశువులకు దాణా, కాల్షియం, మందులు ఇతరత్రా సామగ్రి కూడా రోజూ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పాడి పశువులను పోషిస్తున్న వారంతా పేదలు, మధ్యతరగతి ప్రజలే. ఏ రోజు కష్టంతో ఆ రోజు వెళ్లదీసుకునే వారే. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తీసుకున్న అప్పుకు వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించిన విధంగానే ప్రతీ 15 రోజులకోసారి బిల్లులు చెల్లించాలని, పెండింగులో ఉన్న రూ.80 కోట్ల బిల్లులను ఒకేసారి విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు.