హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటని బుధవారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘పచ్చని పొలాల్లో ఫార్మాసిటీ పేరిట చిచ్చు పెట్టడమే మీ ప్రజాపాలనా? నడిరాత్రి రైతులను అరెస్టు చేసి పోలీస్స్టేషన్లో పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా? ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో అణిచివేయలేరు. మీ బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదు. ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని ఎండగడతం. అరెస్టు చేసిన పట్నం నరేందర్రెడ్డిని, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.