సంగారెడ్డి, జూలై 8(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్కామ్ల కాంగ్రెస్ ప్రభుత్వం పోయి, స్కీమ్ల కేసీఆర్ సర్కార్ రావాలని ప్రజలు బలంగా కోరుకొంటున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు పేర్కొన్నారు. బుధవారం అందోల్లో మాజీ ఎమ్మె ల్యే చంటి క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో ‘సర్’పై బూత్లెవల్ ఏజెంట్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్రావు మాట్లాడుతూ.. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఎక్కడ సర్వే లు నిర్వహించినా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చొని, చుట్టూరా వందమంది పోలీసులను పెట్టుకొన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి దమ్ముంటే ప్రజల్లోకి రావాలని సవాల్ చేశారు. ప్రజలకు అవసరమైన పథకాలను అమలు చేయకుండా రేవం త్ సర్కార్ స్కామ్లకు పాల్పడుతున్నదని, హ్యామ్రోడ్లు, గురుకుల టెండర్లు, పంచాయతీరాజ్, విద్యుత్తు స్కామ్, వడ్ల కొనుగోలు, గుడ్ల కొనుగోలులో కాంగ్రెస్ స్కామ్లు చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఊర్లలో తిరిగితే ప్రజలు తిరుగబడుతారని హెచ్చరించారు. వడ్లలో తరుగు తీస్తే తోలుతీస్తానని పలికిన రేవంత్రెడ్డి.. ఇప్పుడు బ్రోకర్లు, దళారుల చేతిలో తోలుబొమ్మ అయ్యాడని ఎద్దేవా చేశారు.
త్వరలో జహీరాబాద్ వరకు పాదయాత్ర
సింగూరు ప్రాజెక్టు మరమ్మతు పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైంద ని హరీశ్రావు విమర్శించారు. మరమ్మతు ల పేరిట సింగూరును ఖాళీ చేశారని, ఇప్పు డు సూపర్ ఎల్ నినోతో వర్షాలు రాక కరు వు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంట నే సింగూరు ప్రాజెక్టు కింద క్రాప్ హాలిడే ప్రకటించి 45 వేల ఎకరాలకు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశా రు. అందోల్ నియోజకవర్గంలోని 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను రేవంత్ సర్కార్ నిలిపివేసిందని మండిపడ్డారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ త్వరలో నారాయణఖేడ్లోని బోరంచ నల్లపోచమ్మ ఆలయం నుంచి జహీరాబాద్ నియోజకవర్గంలోని రేజింతల్ సిద్ధివినాయక ఆలయం వరకు పాదయాత్ర చేస్తామని ప్రకటించారు.