హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): కృష్ణానదిలో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కడం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తెలంగాణ రాష్ట్రం కృష్ణానీటిని ఎక్కువగా వాడుకుంటుందని చెప్పడం తీవ్ర అభ్యంతరకరమని మండిపడ్డారు. కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డితో కలిసి గాంధీభవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణానదిలో మొత్తం 800 టీఎంసీల నీటిలో తెలంగాణ వాటా 65 శాతమని గుర్తు చేశారు. రాష్ర్టానికి కేటాయించిన నీటినే తెలంగాణ వాడుకోవడం లేదని, అలాంటప్పుడు ఎక్కువ నీటిని వాడుకుంటుందని సీడబ్ల్యూసీ ఏ ఆధారంతో చెప్తున్నదని ప్రశ్నించారు.
కేటాయించిందే వాడుకోవడం లేదు..
తెలంగాణకు కేటాయించిన నీటినే సరిగ్గా వాడుకోలేపోతుండగా, కేటాయించిన దానికంటే నాలుగు టీఎంసీల నీటిని అదనంగా వాడుకుంటుందని సీడబ్ల్యూసీ చెప్పడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించాలని సూచించారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని సీఎం రేవంత్రెడ్డిని కూడా కోరనున్నట్టు సమరసింహారెడ్డి తెలిపారు. కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదందరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన దానికంటే ఎక్కువ నీటిని వాడుకుంటుందని సీడబ్ల్యూసీ చెప్పడం దారుణం అన్నారు. కృష్ణా జలాల పంపిణీపై తొలిసారి ఏర్పాటు చేసిన బచావత్ ట్రిబ్యునల్ న్యాయంగా పంపకాలు చేసిందని గుర్తుచేశారు. కానీ, బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ వచ్చాక తెలంగాణకు అన్యాయం చేసిందని విమర్శించారు. బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ సిఫారసులను పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు.