వనపర్తి, మే 28: వనపర్తి ప్రజల మూడు దశాబ్దాల కోరిక అయిన రోడ్ల విస్తరణ కోసం మంత్రి నిరంజన్రెడ్డి స్థానికులను ఒప్పించి పనులు వేగంగా జరిగేలా చర్యలు చేపడితే.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా అభినందించాల్సిన మాజీ మంత్రి చిన్నారెడ్డి.. ఆదివారం జిల్లా కేంద్రంలోని పాతబజార్లో పార్టీ నాయకులతో చేపట్టిన నిరసనలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘రాజీవ్ చౌక్లోని రాజీవ్గాంధీ విగ్రహాన్ని తొలగిస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎవరైనా విగ్రహం జోలికొస్తే ఒక్కొక్కరిని తుపాకీ పెట్టి కాల్చేస్తా’ అన్న వ్యా ఖ్యలు వివాదాన్ని రాజేశాయి. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఆయనకు నేతల విగ్రహాలు కావాలే తప్పా.. రోడ్ల విస్తరణ వద్దా అని ప్రజలు నిలదీస్తున్నారు. ఇరుకు రోడ్లపై గతంలో ప్రమాదాలకు గురై ఎందరో మృతి చెందారని స్థానికులు చెప్తున్నారు. ప్రజల సౌకర్యార్థం చేపట్టిన రోడ్ల విస్తరణ పనులపై నీతిమాలిన రాజకీయాలు మానుకోవాలని చిన్నారెడ్డికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ హితవు చెప్పారు.