Mallareddy | హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ‘పులి రంగంలోకి దిగింది.. మేక సచ్చుడు ఖాయం’ అని మాజీ సీఎం కేసీఆర్ ఎంట్రీని ఉద్దేశించి అసెంబ్లీలో మీడియా మిత్రులతో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ బాస్ పునరాగమనం పార్టీలో జోష్ నింపిందని చెప్పారు. అటు బీఆర్ఎస్ నాయకులు.. ఇటు కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ఫలితాల నుంచి నేటికీ తేరుకోలేదని తనదైన ైస్టెల్లో అన్నారు.
ఓడిపోతామని బీఆర్ఎస్ నాయకులు.. గెలుస్తామని కాంగ్రెస్ నాయకులు కలలో కూడా ఊహించలేదని పేర్కొన్నారు. తాను మరోసారి పోటీ చేయనని, నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలిస్తే తప్పేంటని అన్నారు. సీఎంను కలిసేందుకు వెళ్లే ముందు.. మీడియాకు అన్ని వివరాలు చెప్తానని పేర్కొన్నారు. ఈ సారి మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని తనపై ఒత్తిడి వచ్చినా.. ఆ టికెట్ను తన కొడుకు కోసం అడుగుతున్నానని వెల్లడించారు. కాంగ్రెస్ రాకతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.