కమ్మర్పల్లి, ఫిబ్రవరి 20: వరద కాలువకు కేటాయింపు కన్నా ఎక్కువగా నీరు వదలొద్దని, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరు డ్యామ్ వరకు గల ఆయకట్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మంగళవారం బాల్కొండ నియోజకవర్గంలో పర్యటిస్తున్న క్రమంలో మార్గమధ్యంలో ఉప్లూర్ వరద కాలువ వద్ద ప్రశాంత్రెడ్డి ఆగారు. దిగువకు నీరు వెళ్తుండటాన్ని గమనించిన ఆయన.. అక్కడి నుంచే ఎస్సారెస్పీ ఎస్ఈకి ఫోన్ చేశారు.
ప్రాజెక్టులో నీటి స్టోరేజీ ఎంత ఉన్నది? ఈ సీజన్లో పంటల సాగుకు ఎన్ని టీఎంసీల నీరు అవసరమవుతుంది? అని అడిగి తెలుసుకున్నారు. కేటాయింపు కంటే ఎక్కువగా నీటిని దిగువకు వదలొద్దని సూచించారు. ఒకవేళ ప్రభుత్వం నీటి విడుదల విషయంలో ఏవైనా నిర్ణయాలు తీసుకున్నా ఎస్సారెస్పీ నుంచి ఎంఎండీ వరకు గల ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కూడా కాపాడాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేటాయింపు కంటే ఎక్కువ నీటిని వదలొద్దని కో రారు. ప్రభుత్వం ఎక్కువగా నీటిని విడుదల చేయాలని నిర్ణయిస్తే తనకు చెప్పాలని, తాను ప్రభుత్వంతోపాటు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడతానని చెప్పారు. రైతుల ప్రయోజనాల కోసం పోరాటం చేస్తామని అన్నారు.