Dalit Bandhu | బూర్గంపహాడ్, మే 25: దండకారణ్యంలో మావోయిస్ట్గా తుపాకీ పట్టుకొని తిరిగిన ఓ వ్యక్తి జీవితాన్ని దళితబంధు పథకం మార్చేసింది. చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న ఆ కుటుంబంలో వెలుగులు నింపింది. దళితబంధు పథకం కింద ఓ దాబాను ఏర్పాటు చేసుకొని నెలకు రూ.40 వేలు సంపాదిస్తూ.. కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఆ మాజీ మావోయిస్ట్. ఆయనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం మోరంపల్లిబంజర్కు చెందిన రాయల వెంకటేశ్వర్లు. పదో తరగతి చదువుతున్న సమయంలోనే వామపక్ష ఉద్యమాలకు ఆకర్షితుడయ్యాడు.
1993లో అప్పటి వామపక్ష ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. 1996లో ప్రజాపంథా నక్సల్స్ వర్గంలో చేరాడు. అక్కడి నుంచి పార్టీ ఆదేశాల మేరకు ఇల్లెందు ఏజెన్సీకి ఎస్డీఎల్సీ సభ్యుడిగా, దళ కమాండర్గా 13 ఏండ్లపాటు అజ్ఞాత జీవితం గడిపాడు. 2002లో జన జీవన స్రవంతిలో ఉండి వామపక్ష ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న జ్యోతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం తిరిగి దండకారణ్యానికి వెళ్లాడు. 2005లో అనారోగ్య కారణాలు, సైద్ధాంతిక విభేదాలతో ఇద్దరూ దండకారణ్యం నుంచి బయటకు వచ్చారు. అప్పటి కొత్తగూడెం ఓఎస్డీ సమక్షంలో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. అప్పటికే ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
చదువుపై ధ్యాసతో..
వెంకటేశ్వర్లుకు చిన్నప్పటి నుంచి చదువంటే ఇష్టం. పదోతరగతి తర్వాత నక్సల్ గ్రూప్లో చేరిన ఆయన 2005లో బయటకు వచ్చి ఓపెన్లో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశాడు. కుటుంబ పోషణకు బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురంలో ఓ ఐటీసీ అనుబంధ సంస్థలో సూపర్వైజర్గా చేరాడు. షిఫ్ట్ ఇన్చార్జిగా ఉద్యోగోన్నతి పొందాడు. కొంతకాలం పనిచేశాక అనివార్య కారణాలతో అక్కడ ఉద్యోగం మానేశాడు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్న క్రమంలో 2013లో ఉద్యమ పత్రిక (నమస్తే తెలంగాణ)లో విలేకరిగా చేరాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న క్రమంలో 2017లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కొంతకాలం ఇంటికే పరిమితమయ్యాడు. తర్వాత ఓ చిన్న ఫ్యాన్సీ షాపు పెట్టుకున్నాడు. షాపు నుంచి అరకొర ఆదాయం వస్తున్నది. కుటుంబ అవసరాలు తీరడం లేదు.
కుమార్తెల చదువులకు డబ్బులు సరిపోవడం లేదు. ఇలా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వెంకటేశ్వర్లు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకానికి ఎంపికయ్యాడు. యూనిట్ ద్వారా విడుదలైన రూ.10 లక్షలతో బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురంలో రాయల్ దాబా ఫాస్ట్ఫుడ్, బిర్యానీ సెంటర్ తెరిచాడు. ప్రస్తుతం దాబా లాభాల బాటలో నడుస్తున్నది. వెంకటేశ్వర్లు నెలకు రూ.40 వేల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ఇటీవల పెద్ద కుమార్తె దిశకు వివాహం చేశాడు. అయినప్పటికీ ఆమెను డిగ్రీ చదివిస్తున్నాడు. చిన్న కుమార్తె దీక్ష డిప్లొమా (డీజిల్ మెకానిక్) పూర్తి చేసింది. భార్య జ్యోతి ఇంటి వద్ద టైలరింగ్ చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నది. ఖాళీ సమయాల్లో దాబాకు వచ్చి భర్తకు సహాయ సహకారాలు అందిస్తున్నది.
జీవితం మారింది
చాలీచాలని జీవితాన్ని సాగిస్తున్న మా కుటుంబాన్ని దళితబంధు ఆదుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. దళితబంధు పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన దాబా ఇప్పుడు బాగా నడుస్తున్నది. ఇప్పుడు మా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు లేవు. మంచి పథకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-రాయల వెంకటేశ్వర్లు