గన్నేరువరం, ఫిబ్రవరి 29: మేడిగడ్డ బరాజ్ పిల్లర్లు కుంగిపోయాయనే సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వం పంటను ఎండబెట్టే ప్రయత్నం చేస్తుందని కరీంనగర్ మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చీమలకుంటపల్లిలో నీరందక ఎండిపోతున్న పంట పొలాలను, నీళ్లు లేక నెర్రెలు బారిన చెరువు, సాగునీటి కాల్వను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ మేడిగడ్డ దగ్గర గోదావరి నదిలో ప్రస్తుతం రోజూ 5 వేల క్యూసెకుల నీరు వృథాగా సముద్రంలోకి పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. మేడిగడ్డ దగ్గర కాఫర్ డ్యాం నిర్మించి వెంటనే నీళ్లను అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోసి, అకడి నుంచి మిడ్ మానేరులోకి నీళ్లు ఎత్తిపోయడంతోపాటు కాలువల ద్వారా యాసంగి పంటలకు నీరందించాలని సూచించారు.
ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు కండ్లముందే ఎండిపోతుంటే రైతులు రోదిస్తున్నారని, ప్రభుత్వం స్పందించి సాగు నీరందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు సాగునీరు ఇచ్చామని, కాంగ్రెస్ అసమర్ధత కారణంగా చెరువులు ఎండిపోవడంతోపాటు పంటలు మాడిపోతున్నాయని ఆవేదన చెందారు. పంటలు కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, రాజన్న సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్పర్సన్ సిద్ధం వేణు తదితరులు ఉన్నారు.