హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లిలో తాను నిబంధనలకు అనుగుణంగానే భూమి కొనుగోలు చేసినట్టు మాజీ సీఎస్ సోమేశ్కుమార్ స్పష్టంచేశారు. సర్వేనంబర్ 249, 260లో సుమారు 25 ఎకరాల భూమి సోమేశ్ భార్య పేరిట ఉన్నది. అక్రమ సంపాదనతో ఆయన భూమి కొన్నారని ఆరోపణలు వచ్చాయి.
ఈ భూమి కొనుగోలుపై సోమేశ్ డీవోపీటీకి సమాచారం ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకుడు మన్నె నర్సింహారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో సోమేశ్ ఆదివారం స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు ప్రశాసన్ నగర్లో కేటాయించిన నివాస స్థలంలో నిర్మించిన ఇంటిని అమ్మేసి కొత్తపల్లిలో 2018లోనే వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్టు వివరించారు. భూమి కొనుగోలుకు అనుమతిస్తూ ప్రభుత్వం తనకు లేఖ కూడా ఇచ్చిందని తెలిపారు.