Congress | నల్లబెల్లి, జూన్ 10: కాంగ్రెస్ కండువా కప్పుకుంటేనే ఏజెన్సీ భూములకు కరెంట్ ఇస్తామని, కమీషన్లు ఇస్తేనే బోర్ కనెక్షన్ను అనుమతిస్తామని ఆ పార్టీ చోటా మోటా లీడర్లు బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈ విధంగా వారు ఇప్పటికి రూ.2.80 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిసింది. ఆ లీడర్లు సొంత పార్టీ నేతలను కూడా వదలడం లేదు. ఇందుకు సంబంధించిన ఓ పోస్ట్ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్గా మారింది. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం, నల్లబెల్లి మండలంలోని ఆసరవెల్లిలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప సర్పంచ్ గుండెబోయిన సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కేసీఆర్ ప్రభుత్వం మండలంలోని ఏజెన్సీ గ్రామాలకు పోడు పట్టాలు ఇచ్చింది. ఈ భూములకు కరెంట్ సదుపాయాన్ని ఇచ్చి, రైతులు బోర్లు వేసుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అనుమతి ఇచ్చారు.
ఇదే అదనుగా భావించిన మేడెపల్లి గ్రామ కాంగ్రెస్ ఎంపీటీసీ భర్త మోహన్, ఆసరవెల్లి, మేడెపెల్లి గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులు జనగాం రాజు, వంగర వెంకన్న, కార్యదర్శి ఆవుల ఐలయ్య బోరు వాహనాల ఏజెంట్ల నుంచి రూ. 2.80 లక్షలు కమీషన్గా తీసుకుని తలా రూ. 77 వేలు పంచుకున్నారు. పోడు పట్టాలు పొందిన 490 మంది రైతులు 9 ట్రాన్స్ఫార్మర్ల కోసం డీడీలు తీయగా, ఇటీవల కాంట్రాక్టర్ విద్యుత్తు స్తంభాలు తీసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న రైతులకే కరెంటు ఇస్తామని, అలాగే తమకు ప్రతి రైతూ కమీషన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. దీనికి రైతులు ససేమిరా అనడంతో విద్యుత్తు కాంట్రాక్టర్, ఫారెస్ట్ అధికారులను బెదిరింపులకు గురి చేసి స్తంభాలను తిప్పి పంపించారు. అయితే కాంగ్రెస్ ముసుగులో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వీరి బాగోతాన్ని ముఖ్య నాయకులకు తెలిపినా పట్టించుకోవడం లేదని, అందుకే వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేశానని మాజీ ఉప సర్పంచ్ సాంబయ్య చెప్పారు.