హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి రంగారెడ్డి జిల్లా పరిధిలో మూడు వేల ఎకరాలను కబ్జా చేశారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఏ జీవన్రెడ్డి ఆరోపించారు. అసైన్మెంట్ భూములను తన భూములుగా చూపించి తప్పుడు పత్రాలతో బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారని అన్నారు. పుప్పాలగూడలో ప్రభుత్వ, కాందిశీకుల భూముల్లో భారీ ఎత్తున అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారని తెలిపారు. కోళ్ల దాణాలోనూ కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పారు. బీఆర్ఎస్ను మోసం చేసిన రంజిత్రెడ్డి కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేసి బీజేపీలోకి వెళ్తాడని అన్నారు. మోసగాళ్లకే మోసగాడు చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి అంటూ విరుచుకుపడ్డారు. రంజిత్రెడ్డి ఎంపీగా ఈసారి మళ్లీ గెలిస్తే చేవెళ్లను అమ్మేస్తాడని హెచ్చరించారు. తెలంగాణ భవన్లో సోమవారం మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్రెడ్డితో కలిసి జీవన్రెడ్డి మీడియాతో మాట్లాడారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజిపేట గ్రామంలో 591/అ/1 సర్వే నంబర్లో 9.27 ఎకరాలు, 591 /ఆ సర్వే నంబర్లో 4.22 ఎకరాల అసైన్డ్ భూములను చూపించి రంజిత్రెడ్డి బ్యాంకు రుణాలు తీసుకున్నారని తెలిపారు. కోళ్ల దాణా సఫ్లయ్ పేరుతో కోళ్ల ఫారాలనే మింగేసిన ఘనుడు రంజిత్రెడ్డి అన్నారు. సినీ నిర్మాత బండ్ల గణేశ్ భూమిని కూడా రంజిత్రెడ్డే గుంజుకున్నాడని చెప్పారు. బ్యాంక్లను మోసం చేసే రంజిత్రెడ్డి చేవెళ్ల ప్రజలకు ఏం మేలు చేస్తాడో అర్థం కావడం లేదని అన్నారు. పుప్పాలగూడ సర్వే నంబర్ 341లో 1.40 కోట్ల చదరపు అడుగుల మేర ప్రభుత్వ, కాందిశీకుల భూమిలో వెస్టర్న్ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్మాణాలు జరుపుతున్నదని, దీనిపై స్థానిక తహసీల్దార్, ఆర్డీవోలు నోటిసులు కూడా జారీ చేశారని తెలిపారు.
ఈ సంస్థ ఇటీవలే కాంగ్రెస్లో చేరిన ఏపీ జితేందర్రెడ్డి వియ్యంకుడదని చెప్పారు. ఈ సంస్థలో రంజిత్రెడ్డి, జితేందర్రెడ్డికి వాటాలు ఉన్నాయని చెప్పారు. ఇలా అనేక అక్రమాల పుట్టగా ఉన్న రంజిత్రెడ్డిని సీఎం రేవంత్రెడ్డి బ్లాక్మెయిల్ చేయడంతో కాంగ్రెస్లో చేరారని ఆరోపించారు. అవినీతి అనకొండలకు కాంగ్రెస్ అండగా నిలుస్తున్నదని విమర్శించారు. ఐదు లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల ఖర్చు భరించేందుకు రంజిత్రెడ్డి సీఎం రేవంత్రెడ్డితో చీకటి ఒప్పదం కుదుర్చుకున్నారి ఆరోపించారు. మాజీ మంత్రి మహేందర్రెడ్డి కూడా భూ కబ్జాలు చెయ్యడంలో దిట్ట అని ఆరోపించారు.
పంచ భూతాలను కూడా వదలని వ్యక్తి రంజిత్రెడ్డి అని, ఆయన అవినీతికి పాల్పడని రంగంలేదని జీవన్రెడ్డి దుయ్యబట్టారు. కరీంనగర్లో పుట్టిన రంజిత్రెడ్డి, వరంగల్లో పెరిగారని, చేవెళ్ల వ్యక్తే కాదని చెప్పారు. పకా నాన్లోకల్ అని, వలస వచ్చి ఇకడ బిజినెస్ పెట్టుకున్నాడని, చేవెళ్ల ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రంజిత్రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతాడు అని మండిపడ్డారు. దొంగే దొంగ అన్నట్టుగా, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా కాంగ్రెస్లోకి వెళ్లిన అవినీతిపరులు సత్య హరిశ్చంద్రుల లాగా పోజులు కొడుతున్నారని విమర్శించారు.